అమృత్ భారత్ రైళ్లకు బ్రహ్మరథం!
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:55 AM
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తక్కువ చార్జీతో వందేభారత్ తరహా సౌకర్యాలను చేరువ చేసే లక్ష్యంతో రైల్వేశాఖ....
ప్రతి రైల్లోనూ 100 నుంచి 150 శాతం ఆక్యుపెన్సీ .. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం
దక్షిణమధ్య రైల్వేకు 5 రైళ్ల కేటాయింపు
ఇప్పటికే మూడు రైళ్ల రాకపోకలునేడు చర్లపల్లి నుంచి కామాఖ్యకు మరో రైలు ప్రారంభం
హైదరాబాద్ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తక్కువ చార్జీతో వందేభారత్ తరహా సౌకర్యాలను చేరువ చేసే లక్ష్యంతో రైల్వేశాఖ కొత్తగా పలు అమృత్భారత్ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం మూడు అమృత్భారత్ ఎక్స్ప్రెస్లు పట్టాలపై పరుగులు పెడుతుండగా, ఈ నెల 18నుంచి మరొకటి, ఏప్రిల్ నెలలో ఇంకొకటి ప్రారంభించేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. గతఏడాది సెప్టెంబరులో చర్లపల్లి-ముజఫరాపూర్ (ఉత్తరప్రదేశ్), జనవరి 27 నుంచి చర్లపల్లి- తిరువనంతపురం (కేరళం) మార్గంలో, ఈ నెల 12న చర్లపల్లి నుంచి నాగర్కోయిల్(తమిళనాడు)కు అమృత్భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ నెల 18న చర్లపల్లి నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్యకు మరొక అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అధికారులు పచ్చజెండా ఊపనున్నారు. ఆయా రైళ్లకు ఇప్పటికే 100నుంచి 150 శాతం ఆక్యుపెన్సీ ఉండడంతో మరిన్ని అమృత్భారత్లు నడిపేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చర్లపల్లి- షాలీమార్ (పశ్చిమ బెంగాల్) మధ్య నడుస్తున్న ప్రత్యేకరైలు స్థానంలో ఏప్రిల్ నుంచి కొత్త అమృత్భారత్ ఎక్స్ప్రెస్ నడపాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. చర్లపల్లి టెర్మినల్ నుంచి నుంచి వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాలకు నడుపుతున్న అమృత్భారత్ ఎక్స్ప్రెస్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. డిమాండ్ ఉన్న ఇతర ప్రాంతాలకూ మరిన్ని అమృత్భారత్ రైళ్లు నడపాలని ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
అమృత్భారత్లో లభించే సౌకర్యాలు
అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సామాన్య ప్రయాణికుల కోసం ప్రీమియం సౌకర్యాలతో రూపొందించారు. ఇవి పూర్తిగా నాన్-ఏసీ రైళ్లు అయినప్పటికీ వందే భారత్ స్థాయి సౌకర్యాలను అందిస్తున్నాయి. ప్రధానంగా.. కంఫర్టబుల్ సీటింగ్, బెర్తులు, మెరుగైన ఎర్గానమిక్ డిజైన్, మృదువైన సీటింగ్, వందేభారత్ తరహా ఇంటీరియర్, చార్జింగ్ పాయింట్లు, ప్రతి సీట్వద్ద యూఎస్బీ- ఏ, సీ టైప్ పోర్టులు, మొబైల్ హోల్డర్లు, బాటిల్ హోల్డర్లు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, మోడరన్ టాయిలెట్లు, ఎలకో్ట్ర-న్యూమాటిక్ ఫ్లషింగ్, ఆటోమేటిక్ సాప్ డిస్పెన్సర్లు తదితర ప్రయోజనాలు లభిస్తాయి. భద్రత పరంగా అన్ని కోచ్లు, లగేజీ ఏరియాల్లో సీసీటీవీ సర్వైలెన్స్ పర్యవేక్షణ, ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్, టాయిలెట్లు, ఎలక్ర్టికల్ కంపార్ట్మెంట్లలో ఏరోసాల్ ఆధారిత ఫైర్ కంట్రోల్, ఎమర్జెన్సీ టాక్బ్యాక్, ప్రయాణికులు-లోకో పైలట్ మధ్య కమ్యూనికేషన్, క్రాష్-వర్తీ డిజైన్, అధిక భద్రతతో కూడిన కోచ్ నిర్మాణం..వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇంకా.. రెండు చివర్లలో లోకో ఇంజన్(పు్ష-పుల్ ఆపరేషన్ )లు, వేగవంతమైన యాక్సిలరేషన్ కారణంగా కుదుపులేని ప్రయాణం, దివ్యాంగులకు అనుకూలంగా స్పెషల్ కోచ్లు, వీల్చైర్ రాంప్లు, ఆన్బోర్డ్ ఫుడ్ సర్వీ్స,ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, రేడియం ఫ్లోర్ స్ర్టిప్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
నాన్-ఏసీ రైలు.. వేగవంతమైన ప్రయాణం
నాన్ ఏసీ అమృత్భారత్ రైలులో తక్కువ టికెట్ చార్జీలతో పాటు భద్రత, సౌకర్యం, వేగవంతమైన ప్రయాణ అనుభవం మధ్యతరగతి ప్రయాణికులకు లభిస్తున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో 8 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, దివ్యాంగుల కోసం రెండు సెకండ్క్లాస్ కోచ్లతో పాటు, ఒక ప్యాంట్రీకార్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్లీపర్క్లా్సలో 100-120 శాతం ఆక్యుపెన్సీ ఉంటుండగా, చర్లపల్లి నుంచి కామాఖ్యకు బయల్దేరనున్న అమృత్భారత్కు 150 శాతం అక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి 7.40గంటలకు బయల్దేరే ఈ నాన్-ఏసీ రైలుకు 8 స్లీపర్క్లాస్ బోగీలు, 9 జనరల్ క్లాస్ బోగీలతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక బోగీ, మరో రెండు లగేజీ బోగీలు ఏర్పాటు చేశారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాలకు ముఖ ద్వారంగా ఉన్న అసోం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది.