నీటి కాలుష్య నివారణ బాధ్యత అన్ని శాఖలది
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:34 AM
తాగునీటి కాలుష్యం ప్రజలందరి సమస్య అని, దీనిని నివారించాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందని హైకోర్టు సోమవారం అభిప్రాయపడింది.
హైకోర్టు వ్యాఖ్య
హిమయత్సాగర్, ఉస్మాన్ సాగర్ల జలాలపై విచారణ
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): తాగునీటి కాలుష్యం ప్రజలందరి సమస్య అని, దీనిని నివారించాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందని హైకోర్టు సోమవారం అభిప్రాయపడింది. నీటిని శుభ్రపరచకుండా ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించింది. కాలుష్యమంటే కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రమాదకర లోహాలను కూడా గమనించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు చెందిన అంశమంటూ మిగిలిన శాఖలు ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది. హైదరాబాద్, సికింద్రాబాద్లకు తాగునీటిని సరఫరా చేసే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నీటి నాణ్యత తగ్గుతోందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం మొహియుద్దీన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందుకు అన్ని శాఖలు బాధ్యత తీసుకోవాలని చెబుతూ కౌంటర్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీతోపాటు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, ఇతరులను ఆదేశించింది.