నూతన పద్ధతులతో పంట సరళిలో మార్పు తేవాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:49 AM
వ్యవసాయంలో నూతన పద్ధతులతో పంటల సరళిలో మార్పులు తీసుకొచ్చి రైతులకు మేలు జరిగేలా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు పాటుపడాలని వ్యవసాయ రంగ నిపుణుడు డా. ప్రభు ఎల్ పింగళి పిలుపునిచ్చారు.
నూతన పద్ధతులతో పంట సరళిలో మార్పు తేవాలి
రైతుల మేలు కోసం విద్యార్థులు పాటుపడాలి
వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సంలో పింగళి పిలుపు
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో నూతన పద్ధతులతో పంటల సరళిలో మార్పులు తీసుకొచ్చి రైతులకు మేలు జరిగేలా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు పాటుపడాలని వ్యవసాయ రంగ నిపుణుడు డా. ప్రభు ఎల్ పింగళి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.వినియోగదారుల అహార అలవాట్లకు అనుగుణంగా, ప్రజలకు పౌష్టికాహార భద్రత అందించే విధంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యతో కలిసి ఆయన బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందజేశారు. మొత్తం 2,135 మంది అండర్ గ్రాడ్యుయేట్స్కి, 480 మంది పోస్టు గ్రాడ్యుయేట్స్కి, 129 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నారాయణపేట జిల్లాకు చెందిన స్నేహలత 7 బంగారు పతకాలు, హనుమకొండ జిల్లాకు చెందిన గన్నేరపు నవ్య 6, వరంగల్ జిల్లాకు చెందిన సంజన 5 గోల్డ్ మెడల్స్ సాధించారు. అగ్రానమిలో కరీంనగర్కు చెందిన వినయ్ ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేసి పట్టా అందుకున్న మొట్టమొదటి విద్యార్థిగా ఘనత సాధించారు.