ఇక్కడ మాకు.. అక్కడ మీకు..!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:30 AM
మునిసిపల్ ఎన్నికల్లో రాజకీయాలు రంగు మారుతున్నాయి. సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కూడా కొన్నిచోట్ల కలిసి పనిచేస్తున్నాయి. ‘‘మాకు ఇక్కడ మద్దతు ఇవ్వండి. మీకు అక్కడ మద్దతు ఇస్తాం...
రాజకీయ పార్టీల అంతర్గత పొత్తులు.. చైర్మన్ పీఠాలపై ప్రధాన పార్టీల గురి
ఉమ్మడి ఆదిలాబాద్లో వేడెక్కిన ప్రచారం
(ఆదిలాబాద్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
మునిసిపల్ ఎన్నికల్లో రాజకీయాలు రంగు మారుతున్నాయి. సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కూడా కొన్నిచోట్ల కలిసి పనిచేస్తున్నాయి. ‘‘మాకు ఇక్కడ మద్దతు ఇవ్వండి. మీకు అక్కడ మద్దతు ఇస్తాం’’ అంటూ నేతలు అంతర్గత పొత్తులు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. 10 మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిఽఽధిలో పార్టీల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత ఒప్పందాలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.. గత ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం చాటిన బీఆర్ఎస్, ప్రస్తుతం మెజారిటీ స్థానాల్లో చతికిలపడినట్లు కనిపిస్తోంది. రెండు మూడు స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల గులాబీ శ్రేణులు డీలా పడడంతో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రె్సలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గతంలో ఒక్క సీటు కూడా గెలవని అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి క్లీన్ స్వీప్ చేయాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
ఆ మూడింట్లో మజ్లిస్ మ్యాజిక్..
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా మునిసిపాలిటీల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మజ్లి్సకు కంచుకోటగా ఉన్న భైంసాలో బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ తన పట్టు నిరూపించుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ బలహీనపడడంతో మజ్లిస్ మద్దతు కాంగ్రె్సకు దక్కుతుందనే చర్చ సాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ హంగ్ ఏర్పడితే మజ్లిస్ కీలకం కానుంది. ప్రచారంలో మజ్లిస్ అధినేత ఒవైసీ కేవలం బీజేపీ, బీఆర్ఎ్సలనే టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆదిలాబాద్లో బీజేపీ కొన్ని వార్డుల్లో బీఆర్ఎ్సతో అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆసిఫాబాద్లో ఉత్కంఠ..
కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మునిసిపాలిటీ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఇది సవాల్గా మారగా, కాంగ్రె్సలో ఉన్న అంతర్గత విభేదాలు ఆమెకు కలిసొచ్చేలా ఉన్నాయి. కాగజ్నగర్లో మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న ప్రవీణ్కుమార్, కోనప్పలు ఇప్పుడు కలిసిపోవడం విశేషం. వీరిద్దరినీ ఎదుర్కొనేందుకు బీజేపీ ఎమ్మెల్యే హరీశ్బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ లోపాయికారీగా సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కోల్ బెల్ట్లో వింత సమీకరణాలు..
మంచిర్యాల జిల్లా రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. మంత్రి గడ్డం వివేక్కుతన సొంత నియోజకవర్గం చెన్నూరులో బాల్క సుమన్ గట్టి పోటీ ఇస్తున్నారు. వివేక్ అనుచరులు కొందరు బీఆర్ఎ్సలో చేరడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ సీపీఐతో పొత్తు పెట్టుకుంది. క్యాతనపల్లిలో సీపీఐ బీఆర్ఎ్సతో జతకట్టింది. లక్షెట్టిపేట, బెల్లంపల్లిలో కాంగ్రె్సను దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎ్సలు అంతర్గత ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.