పలుచోట్ల ఏసీబీ దాడులు
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:54 AM
రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మునిసిపల్, నీటి పారుదలశాఖ కార్యాలయాలపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇక జీహెచ్ఎంసీలో హైదరాబాద్ శివారు నగర పాలక సంస్థలు....
కరీంనగర్లో నీటి పారుదలశాఖ అధికారి మధుసూదన్ అరెస్టు
భద్రాద్రి కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాలో రూ.14.77 లక్షల నిధులు
కామారెడ్డి మునిసిపల్ సిబ్బంది ఆర్థిక లావాదేవీలపై ఆరా
బడంగిపేట్ సర్కిల్లో తనిఖీలు
సరూర్నగర్/ కరీంనగర్ క్రైం/ కామారెడ్డి టౌన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మునిసిపల్, నీటి పారుదలశాఖ కార్యాలయాలపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇక జీహెచ్ఎంసీలో హైదరాబాద్ శివారు నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీల విలీనానికి ముందు రోజు చేయని పనులకు అధికారులు బిల్లులను సృష్టించి నిధుల స్వాహాకు ప్రణాళికలు రూపొందించారని, రూ.కోట్ల నిధుల కుంభకోణానికి పాల్పడినట్లు ఇటీవల ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ బడంగిపేట్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ గంగసాని శ్రీధర్ సారథ్యంలో తనిఖీలు చేశారు. కీలక ఫైళ్లను వెంట తీసుకెళ్లారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని నీటి పారుదలశాఖ వర్క్స్ అకౌంట్స్ జేడీ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ను అరెస్టు చేసినట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. ఎల్ఎండీ కాలనీలోని ఆయన కార్యాలయం, కరీంనగర్ నగరంలోని భరత్నగర్లోని మధుసూదన్ ఇంట్లో జరిపిన సోదాల్లో బినామీ బ్యాంకు ఖాతాల పాస్బుక్లు, ఏటీఎం కార్డులు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022 సెప్టెంబరు 15-2023 సెప్టెంబరు 20 తేదీల మధ్య భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతా లో రూ.14.77 లక్షల లంచం తీసుకున్నట్లు వెల్లడైందని విజయ్కుమార్ తెలిపారు. కామారెడ్డి మునిసిపల్ కార్యాలయంలో సోదాలు జరిపారు. సిబ్బంది సెల్ఫోన్లలో ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీశారు.