రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:46 AM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లోని కల్లు దుకాణ యజమానుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న బిచ్కుంద..
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ఘటన
8కొత్తగూడెం నగర పాలక సంస్థలో ఏసీబీ తనిఖీలు
హైదరాబాద్/ బిచ్కుంద/ పాల్వంచ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లోని కల్లు దుకాణ యజమానుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న బిచ్కుంద ఎక్సైజ్ సీఐ దీనూ సత్యనారాయణను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ మండల కేంద్రంలోని కల్లు కాంపౌండ్ను పాత చోటు నుంచి కొత్త స్థలానికి మార్చడానికి వ్యాపార అనుమతులు ఇవ్వడానికి ఎక్సైజ్ సీఐ దీనూ సత్యనారాయణ రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులకు కల్లు సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సొంతింట్లోనే తొలి విడతగా కల్లు సంఘాల ప్రతినిధుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఏసీబీ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ డీజీ చారు సిన్హా తెలిపారు. సత్యనారాయణ బ్యాగులో లెక్క చెప్పని రూ.45,760 నగదు స్వాధీనం చేసుకున్నామని, ఆయన అక్రమ సంపాదనపై దర్యాప్తు సాగుతుందన్నారు. ఎక్సైజ్ సీఐ సత్య నారాయణ తన అధికారాలను దుర్వినియోగం చేసి అనుచిత లబ్ధి పొందినట్లు స్పష్టమైందని చారుసిన్హా వెల్లడించారు. మరోవైపు, మరోవైపు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగర పాలక సంస్థ పాల్వంచ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. గతేడాది జూలై 18న నిర్వహించిన అకస్మిక దాడుల్లో అప్పటి కమిషనర్ వాహన డ్రైవర్ రాజేశ్ ఆన్లైన్ లావాదేవీలపై 12 మంది సిబ్బంది వాంగ్మూలాలను సేకరించారు.