యాసంగిలో 70 లక్షల ఎకరాల్లో సాగు !
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:47 AM
యాసంగి సీజన్లో 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్లో 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ 29 లక్షల ఎకరాల్లో వరి నాట్లతోపాటు మొత్తం 44 లక్షల ఎకరా (63ు)ల్లో వివిధ పంటలు సాగు చేశారు. 1.85 లక్షల ఎకరాల్లో జొన్న, 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. యాసంగిలో 51.49 లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అంటే 56శాతం పొలాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. వచ్చే 2 వారాల్లో మిగతా విస్తీర్ణంలో వరి నాట్లు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వరి తర్వాత ఎక్కువగా ఏకంగా 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. ప్రతి యేటా మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 6.46 లక్షల ఎకరాలు. శనగల సాధారణ సాగు విస్తీర్ణం 3 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ 1.70 లక్షల (56ు) ఎకరాల్లో సాగు చేశారు. 2.60 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకూ 1.72 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాల సాగుకు 2.10 లక్షల (52ు) ఎకరాల్లో రైతులు సాగు చేశారు. 3.53 లక్షలకు 1.93 లక్షల ఎకరాల్లో (55ు) నూనె గింజలు విత్తారు. వచ్చే నెల మొదటి పక్షం రోజుల్లో పంటల సాగు పూర్తయ్యే అవకాశాలున్నాయి.