ఉపాధి కల్పనే లక్ష్యంగా 39 ప్రత్యేక కోర్సులు
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:38 AM
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా యూజీ, పీజీ స్థాయిలో 39 కోర్సులకు రూపకల్పన చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు...
టీసాట్ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా యూజీ, పీజీ స్థాయిలో 39 కోర్సులకు రూపకల్పన చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ‘యూజీ అండ్ పీజీ కోర్సెస్ న్యూ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్’ అంశంపై మంగళవారం టి-సాట్ వేదికగా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అండర్ గ్రాడ్యుయేట్లో 19, పోస్టు గ్రాడ్యుయేట్లో 10 కోర్సులను తక్షణమే ఉపాధి కల్పించేవిగా ఆచరణలోకి తేబోతున్నామని, ఏఈడీపీ(అప్రెంటీస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. 2030నాటికి తెలంగాణలోని వివిధ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశాలున్నాయని, వాటి కోసం యువతను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు.