Share News

388 ఎకరాల సర్వే పూర్తి

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:04 AM

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలో రెవెన్యూ, సర్వే అధికారుల సర్వే శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. జిల్లా కలెక్టర్‌ హైమావతి పర్యవేక్షణలో గజ్వేల్‌ ఆర్డీవో చంద్రకళ, జిల్లా సర్వే ఏడీ సుదర్శన్‌ నేతృత్వంలో సర్వే కొనసాగించారు. కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు దాదాపు అరకిలోమీటర్‌ దూరంలో ఉన్న సర్వే నంబర్‌ 325లో ముగ్గురు డీఐలు, పది మంది సర్వేయర్లు, ఐదుగురు జీపీవోలతో నాలుగు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహించారు

388 ఎకరాల సర్వే పూర్తి
survey

  • ఎర్రవల్లిలో రెండో రోజూ సర్వే

  • 4 బృందాలతో చేపట్టిన అధికారులు

  • సర్వేకు సహకరించిన రైతులు

  • తొలిరోజు అడ్డుకోవడంతో బందోబస్తు

  • రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు

  • రేపటి నుంచి రైతుల వారీగా సర్వే

  • ఎర్రవల్లిలో రెండో రోజూ సర్వే

  • 4 బృందాలతో చేపట్టిన అధికారులు

  • స్వచ్ఛందంగా సహకరించిన రైతులు

గజ్వేల్‌/మర్కుక్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలో రెవెన్యూ, సర్వే అధికారుల సర్వే శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. జిల్లా కలెక్టర్‌ హైమావతి పర్యవేక్షణలో గజ్వేల్‌ ఆర్డీవో చంద్రకళ, జిల్లా సర్వే ఏడీ సుదర్శన్‌ నేతృత్వంలో సర్వే కొనసాగించారు. కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు దాదాపు అరకిలోమీటర్‌ దూరంలో ఉన్న సర్వే నంబర్‌ 325లో ముగ్గురు డీఐలు, పది మంది సర్వేయర్లు, ఐదుగురు జీపీవోలతో నాలుగు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహించారు. గ్రామంలోని సర్వే నంబర్‌ 325లోని 388 ఎకరాల పూర్తి బౌండరీని శాటిలైట్‌ ద్వారా నిర్ధారించారు. శుక్రవారం ఉదయం 8గంటల ప్రారంభమైన సర్వే నిర్విరామంగా పది గంటలపాటు కొనసాగింది. సాయంత్రం 6గంటలకు సర్వే పూర్తి చేసిన అధికారులు.. ఆ తరువాత తహసీల్దార్‌ కార్యాలయంలో కోఆర్డినేటర్ల ద్వారా బౌండరీని మ్యాపింగ్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, మొదటి రోజు ఎర్రవల్లి గ్రామంలో అధికారులు చేపట్టిన సర్వేను పలువురు గ్రామస్తులు అడ్డుకున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు సైతం సర్వేకు స్వచ్ఛందంగా సహకరించారు. గ్రామంలో తాము చేసిన తప్పేమీ లేదని, అధికారులు సర్వే చేసుకోవచ్చని రైతులు పేర్కొన్నారు.


రికార్డుల పరిశీలన.. రైతుల వారీగా సర్వే

ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 325 బౌండరీ సర్వే పూర్తయిన నేపథ్యంలో అధికారులు మొత్తం సర్వే నంబర్‌ మ్యాపింగ్‌ వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మ్యాప్‌తో రికార్డులను పరిశీలించిన అనంతరం రైతుల వారీగా ఫీల్డ్‌ సర్వే నిర్వహించి, ఎంజాయ్‌మెంట్‌ను పరిశీలించనున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్‌అసెంబ్లీలో విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ప్రతి గజం భూమినీ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు రైతుల వారీ సర్వేను పకడ్బందీగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, కేసీఆర్‌ ఫాంహౌస్‌ భూములు, ఆయన కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలను మర్కుక్‌ తహసీల్దార్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పాత రికార్డుతోపాటు కొత్త రికార్డు వరకు పూర్తిగా వడబోత ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు ఎర్రవల్లి గ్రామానికి కాంగ్రెస్‌ ఎంపీల బృందం వస్తుందన్న ప్రచారంతో గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరకు ఎంపీల బృందం నేరుగా కొండపాక మండలం వెలికట్టకు వెళ్తున్నట్లు తెలియడంతో బందోబస్తును అక్కడికి షిఫ్ట్‌ చేశారు.

Updated Date - Sep 19 , 2026 | 06:10 AM