Telangana ACB Report: 2199 ఏసీబీ కేసుల్లో 273 మంది అరెస్టు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:40 AM
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖాధికారులు ఈ ఏడాది 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్టు చేశారు.
115 కేసుల్లో ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ అనుమతి
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖాధికారులు ఈ ఏడాది 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్టు చేశారు. ఇందులో 157 ట్రాప్ కేసులకు సంబంధించి 224 మంది అరెస్టు అయ్యారని, వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, మిగిలిన వారు ప్రైవేటు వ్యక్తులని ఏసీబీ వార్షిక నివేదికలో డీజీ చారుసిన్హా పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులు 15, ప్రభుత్వ ఉద్యోగుల నేరపూరిత ప్రవర్తనకు సంబంధించి 26 కేసులు నమోదు చేశామని ఆమె తెలిపారు. అవినీతి ఫిర్యాదులకు సంబంధించి 26 తనిఖీలు నిర్వహించామని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీవో ఆఫీసులు, సాంఘిక సంక్షేమ హస్టళ్లలో 54 అకస్మిక తనిఖీలు నిర్వహించామని వివరించారు. ఈ ఏడాది 115 కేసుల్లో ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతులు లభించడంతో చార్జీషీట్లు దాఖలు చేశామని, ఇంకా చాలా కేసుల్లో ప్రాసిక్యూషన్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. 158 ట్రాప్ కేసులకు సంబంధించి రూ.57,17,500 స్వాధీనం చేసుకోగా ఇందులో రూ.35,89,500లు ఫిర్యాదు దారులకు తిరిగి ఇచ్చేశామని వివరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 15 నమోదు కాగా, రిజిష్టర్డ్ డాక్యుమెంట్ విలువల ప్రకారం ఆ ఆస్తుల విలువ రూ.96,13,50,554 కోట్లు ఉందని, అయితే వీటి మార్కెట్ విలువ ఇంతకన్నా ఎక్కువగా ఉంటుందని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు.