ఒకే రోజు 128 ఫిర్యాదులు!
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:59 AM
రియల్ ఎస్టేట్ మోసాలపై రెరా అథారిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 128 ఫిర్యాదులను అథారిటీ విచారణకు స్వీకరించింది.
రియల్ ఎస్టేట్ మోసాలపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
ప్రాజెక్టు జాప్యం, ఒప్పందం ఉల్లంఘనలపై నమోదు
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్ర జ్యోతి) : రియల్ ఎస్టేట్ మోసాలపై రెరా అథారిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 128 ఫిర్యాదులను అథారిటీ విచారణకు స్వీకరించింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. ఫిర్యాదుల జాబితాలో శ్రీవారి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, మంత్రి డెవలపర్స్, ప్రణీత్ కాన్సెప్ట్, వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ, శర్వాణి వెంచర్స్, భారతి బిల్డర్స్ వంటి ప్రముఖ సంస్థలు అనేకం ఉన్నాయి. శ్రీవారి కన్స్ట్రక్షన్ కంపెనీ మీద భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఒకే ప్రాజెక్టుపై పలువురు కొనుగోలుదారులు ఫిర్యాదు చేయడం రియల్ ఎస్టేట్ మోసాల తీవ్రతకు నిదర్శనం. ప్రణీత్, వాసవి ఇన్ఫ్రా సంస్థల మీద డజన్ల కొద్దీ ఫిర్యాదులు నమోదయ్యాయి. అథారిటీకి వచ్చిన అత్యధిక ఫిర్యాదుల్లో ప్రాజెక్టు జాప్యం చేస్తున్నారని, ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, హామీలను నిలబెట్టుకోవడం లేదనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి.