భారత్ బౌలర్లను చిత్తు చేసిన సోనల్.. ఈ లంక స్టార్ ఎవరో తెలుసా?
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:52 AM
గాలే వేదికగా భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో శ్రీలంక యువ ఆటగాడు సోనల్ దినూష సంచలన ప్రదర్శన చేశాడు. కెరీర్లో తొలి టెస్టు సెంచరీని భారత జట్టుపైనే సాధించి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో లంక 284 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ కు 178 పరుగుల ఆధిక్యం లభించింది. లంక ఆ మాత్రం స్కోర్ చేయడానికి ప్రధాన కారణం.. యువ బ్యాటర్ సోనల్ దినూష అద్భుతమైన పోరాట పటిమ. లంక 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన దినుష తన వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
ఈ యువ బ్యాటర్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో నాలుగు గంటలకు పైగా క్రీజులో నిలిచాడు. డిక్వెల్లాతో కలిసి 6వ వికెట్కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 25 ఏళ్ల ఈ ఎడమ చేతి బ్యాటర్ కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. టీమిండియాపైనే తన తొలి సెంచరీ నమోదు చేసి.. అందరి దృష్టి ఆకర్షించాడు.
సోనల్ దినూష 2000 డిసెంబర్ 4న కొలంబోలో జన్మించాడు. మహానామ కళాశాలలో చదువుకున్న అతను శ్రీలంక వయో విభాగాల క్రికెట్ నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు. సోనాల్ దినూష 17 ఏళ్ల వయసులోనే 2018లో కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున ఫస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటివరకు 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 45.09 సగటుతో 3,698 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే బౌలింగ్ లోనూ లెఫ్టార్మ్ స్పిన్నర్గా అతడు ఫస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 133 వికెట్లు తీశాడు.
సౌతాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్-2026లో శ్రీలంక జట్టులో దినుషకు చోటు దక్కింది. ఈ టోర్నీలో ఆల్రౌండర్గా తన సేవలను అందించాడు. అలానే బంగ్లాదేశ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇప్పటివరకు కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడిన దినుష.. 57.2 సగటుతో 286 పరుగులు చేశాడు. అదేవిధంగా 6 వికెట్లు సాధించాడు.