Share News

అటు సూర్య.. ఇటు ఇషాన్‌

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:08 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ (37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 నాటౌట్‌) ఏడాదిన్నర తర్వాత తన సహజశైలిలో చెలరేగగా, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌.....

అటు సూర్య.. ఇటు ఇషాన్‌

  • తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అదుర్స్‌

  • రెండో టీ20లో కివీస్‌‌పై భారత్‌ ఘనవిజయం

రాయ్‌పూర్‌: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ (37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 నాటౌట్‌) ఏడాదిన్నర తర్వాత తన సహజశైలిలో చెలరేగగా, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) మెరుపు బ్యాటింగ్‌తో సత్తా చాటుకున్నాడు. దీంతో శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే సిరీ్‌సలో 2-0తో ఆధిక్యంలో నిలవగా, మూడో మ్యాచ్‌ ఆదివారం గువాహటిలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44), సీఫర్ట్‌ (13 బంతుల్లో 5 ఫోర్లతో 24) వేగంగా ఆడారు. కుల్దీ్‌పనకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 15.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 209 పరుగులు చేసి గెలిచింది. 23 ఇన్నింగ్స్‌ (468 రోజులు) తర్వాత సూర్య హాఫ్‌ సెంచరీ సాధించగా, శివమ్‌ దూబే (18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 36 నాటౌట్‌) సహకరించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఇషాన్‌ నిలిచాడు.


పరుగుల వరద: భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఝలక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు శాంసన్‌ (6), అభిషేక్‌ (0) పెవిలియన్‌కు చేరారు. అప్పటికి స్కోరు ఆరు పరుగులు మాత్రమే. కానీ కివీస్‌ సంతోషాన్ని ఆవిరి చేస్తూ ఇషాన్‌, సూర్యకుమార్‌ మైదానంలో డైనమైట్లలా పేలారు. ఆరంభంలో ఇషాన్‌ స్ట్రయికింగ్‌ ఎక్కువగా తనే తీసుకుంటూ బౌండరీల వర్షాన్ని కురిపించాడు. బౌలర్‌ ఎవరైనా బంతి గాల్లోనే కనిపించాలన్న కసితో ఇషాన్‌ చెలరేగగా, పక్కన సూర్య ప్రేక్షక పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. మూడో ఓవర్‌లో ఇషాన్‌ 4,4,4,6తో 24 పరుగులు రాగా, శాంట్నర్‌ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. ఇక ఆరో ఓవర్‌లో 6,4,4తో 21 రన్స్‌ రాబట్టడంతో పాటు 21 బంతుల్లోనే ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. ఈ ధాటికి పవర్‌ప్లేలో భారత్‌ 75/2 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక ఇషాన్‌ జోష్‌తో సూర్య కూడా బ్యాట్‌ ఝుళిపించి తొమ్మిదో ఓవర్‌లో 4,4,4,4,6,2 ఓ వైడ్‌తో ఏకంగా 25 రన్స్‌ అందించాడు. కానీ స్పిన్నర్‌ సోధీ తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్‌ వికెట్‌ తీయడంతో మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇందులో ఇషాన్‌వే 76 రన్స్‌ ఉండడం విశేషం. ఇక ఆ తర్వాత సూర్య విధ్వంసంతో కివీస్‌ కకావికలమైంది. అప్పర్‌ కట్‌, స్వీప్‌, డ్రైవ్‌ షాట్లతో యధేచ్ఛగా చెలరేగడంతో పాటు 11వ ఓవర్‌లో 6,4తో 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే 14వ ఓవర్‌లో 6,4,4 రాబట్టి విజయాన్ని సులువు చేశాడు. అటు దూబే సైతం భారీ షాట్లతో చెలరేగగా, మరో 28 బంతులుండగానే భారత్‌ మ్యాచ్‌ను ముగించింది. ఈ జోడీ మధ్య నాలుగో వికెట్‌కు అజేయంగా 81 పరుగులు నమోదయ్యాయి.


ఆరంభం అదిరినా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతి నుంచే ఎదురుదాడి లక్ష్యంగా సాగింది. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్‌ వేగంగా ఆడేందుకు ప్రయత్నించారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ కాన్వే (19) 4,4,6,4తో విరుచుకుపడగా, అర్ష్‌దీప్‌ ఏకంగా 18 రన్స్‌ ఇచ్చుకున్నాడు. మరో ఓపెనర్‌ సీఫర్ట్‌ సైతం అతడి రెండో ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు బాది 18 రన్స్‌ రాబట్టాడు. కానీ వరుస ఓవర్లలో కాన్వేను హర్షిత్‌, సీఫర్ట్‌ను వరుణ్‌ అవుట్‌ చేయడంతో మొదటి వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా రచిన్‌ వచ్చీరాగానే ఆరో ఓవర్‌లో 6,4,6తో 19 రన్స్‌ రాబట్టగా పవర్‌ప్లేలో కివీస్‌ 64/2 స్కోరుతో నిలిచింది. మరో ఎండ్‌లో కుల్దీప్‌ను ఫిలిప్స్‌ (19) లక్ష్యంగా చేసుకుని 6,4,4తో ఆకట్టుకున్నాడు. అయితే అదే ఓవర్‌లో హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక మిచెల్‌ (18) రెండు ఫోర్లతో జట్టు పదో ఓవర్‌లోనే వంద రన్స్‌ దాటేసింది. మిచెల్‌, రచిన్‌లను కూడా వరుస ఓవర్లలో దూబే, కుల్దీప్‌ అవుట్‌ చేయడంతో కివీస్‌ 129 రన్స్‌ దగ్గర 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మధ్య ఓవర్లలో స్పిన్నర్లు పరుగులను నియంత్రించారు. చాప్‌మన్‌ (10) రన్స్‌ తీసేందుకు ఇబ్బందిపడ్డాడు. శాంట్నర్‌ మాత్రం మరో ఎండ్‌లో బౌండరీలతో జోరు చూపాడు. చివరి 3 ఓవర్లలో ఫౌక్స్‌ (15 నాటౌట్‌) సహాయంతో 47 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 200 దాటింది.

1

  • టీ20ల్లో తమ అత్యధిక ఛేదన (209)ను పూర్తి చేసిన భారత్‌. 2023లోనూ ఇన్నే రన్స్‌ను ఛేదించింది.

  • టీ20 ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో ఎక్కువ (18) పరుగులిచ్చుకున్న భారత బౌలర్‌గా భువనేశ్వర్‌తో సమంగా నిలిచిన అర్ష్‌దీప్‌.

  • అంతర్జాతీయ టీ20ల్లో 25 అంతకంటే తక్కువ బంతుల్లోనే ఎక్కువ (8) ఫిఫ్టీలు సాధించి అభిషేక్‌తో సమంగా నిలిచిన సూర్యకుమార్‌.

  • 200, ఆపై పరుగుల ఛేదనను వేగంగా పూర్తి చేసిన జట్టుగా భారత్‌ (15.2 ఓవర్లలో 209 రన్స్‌). ఈ క్రమంలో పాకిస్థాన్‌ (2025లో న్యూజిలాండ్‌పై 16 ఓవర్లలో 205 రన్స్‌)ను అధిగమించింది.

3

  • పవర్‌ప్లేలోనే హాఫ్‌ సెంచరీ చేసిన మూడో నాన్‌ ఓపెనర్‌గా ఇషాన్‌. గతంలో డియాన్‌ మైర్స్‌, ఇన్‌గ్లి్‌స ఉన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 04:08 AM