Indian cricket team: సిరీస్ పట్టేదెవరు?
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:00 AM
స్వదేశంలో న్యూజిలాండ్పై భారత క్రికెట్ జట్టు తిరుగులేని ఆధిపత్యం చూపుతోంది. ఎంతలా అంటే.. గతంలో భారత గడ్డపై కివీస్ ఏడుసార్లు పర్యటించినా....
గెలుపే లక్ష్యంగా భారత్
తొలి సిరీస్ కోసం కివీస్
ఇండోర్: స్వదేశంలో న్యూజిలాండ్పై భారత క్రికెట్ జట్టు తిరుగులేని ఆధిపత్యం చూపుతోంది. ఎంతలా అంటే.. గతంలో భారత గడ్డపై కివీస్ ఏడుసార్లు పర్యటించినా ఒక్కసారి కూడా ఆ జట్టు ద్వైపాక్షిక వన్డే సిరీ్సను నెగ్గలేదు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైన వేళ ఆదివారం ఇండోర్లో ఇరుజట్ల మధ్య నిర్ణాయక పోరు జరుగనుంది. ఈనేపథ్యంలో పర్యాటక జట్టుపై ఎప్పటిలాగే టీమిండియా తమ జోరును చూపుతుందా? లేక దశాబ్ధాలుగా ఊరిస్తోన్న వన్డే సిరీ్సను కివీస్ తొలిసారి దక్కించుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది. ఇక.. 2019 నుంచి స్వదేశంలో భారత్.. ఏ జట్టుపైనా వన్డే సిరీస్ను కోల్పోలేదు.
అర్ష్దీ్పనకు చాన్స్!
ఆఖరి మ్యాచ్లో గిల్ సేన కూర్పుపై అందరి దృష్టి పడనుంది. కొత్త బంతితో చక్కగా స్వింగ్ చేయగల లెఫ్టామ్ పేసర్ అర్ష్దీ్పను ఆడించే అవకాశం ఉంది. కివీస్ టాప్, మిడిలార్డర్లో ఎక్కువ కుడిచేతి బ్యాటర్లు ఉండడంతో వారిపై తను ఒత్తిడి పెంచవచ్చు. అలాగే మధ్య ఓవర్లలో స్పిన్నర్లపై భారం తగ్గుతుంది. అలాగే నితీశ్ను రెండో వన్డేలో ఆడించినా అతడితో పెద్దగా బౌలింగ్ చేయించలేదు. అతడి స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ ఆయుష్ బదోనితో ముందుకెళితే ఎలా ఉంటుందనే ఆలోచనలో కోచ్ గంభీర్ ఉన్నాడు. బ్యాటింగ్లో కెప్టెన్ గిల్ ఫామ్లోకి రాగా రోహిత్ నుంచి భారీ స్కోరు రావాల్సి ఉంది. మరో ఆరు నెలల వరకు వన్డేలు లేకపోవడంతో అభిమానులు ఈ మ్యాచ్లో రో-కో షో చూడాలని భావిస్తున్నారు.
గిల్ వెంట ప్యూరిఫయర్
ఇండోర్లో కలుషిత తాగునీటి వల్ల ఇటీవల పలువురు మృత్యువాత పడడంతో భారత క్రికెట్ జట్టు తమ ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా వీరు బస చేసే స్టార్ హోటల్తో పాటు స్టేడియంలోనూ పరిశుభ్రమైన నీటిని అందించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు కెప్టెన్ గిల్ మాత్రం ఎందుకైనా మంచిదని.. తన హోటల్ గదిలో ఏకంగా రూ.3 లక్షల ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫయర్ను బిగించుకున్నట్టు సమాచారం. దీనికి ప్యాకేజ్డ్ నీటిని కూడా తిరిగి శుద్ధి చేసే సామర్థ్యం ఉండనుంది.