బంగ్లాపై వేటు తప్పదా?
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:59 AM
టీ20 వరల్డ్కప్ కోసం భారత్లో పర్యటించాల్సిందేనని ఐసీసీ.. ఎట్టి పరిస్థితిల్లోనూ వెళ్లబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తేల్చి చెప్పడంతో ఇప్పుడేం జరుగనుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది.
భారత్లో ఆడబోమంటున్న బీసీబీ
ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ
ఢాకా: టీ20 వరల్డ్కప్ కోసం భారత్లో పర్యటించాల్సిందేనని ఐసీసీ.. ఎట్టి పరిస్థితిల్లోనూ వెళ్లబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తేల్చి చెప్పడంతో ఇప్పుడేం జరుగనుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇదే విషయమై బుధవారం బీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ ఆటగాళ్ల భద్రతపై వెనుకంజ వేయమని, భారత్లో ఆడకూడదన్న తమ నిర్ణయంలో మార్పూ ఉండదని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం తెలిపాడు. దీంతో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను ఆడించాలన్న ఆలోచనలో ఐసీసీ ఉన్నట్టు సమాచారం. కానీ టీ20 వరల్డ్కప్లో ఆడే అవకాశాన్ని ఎవరు వదిలేసుకుంటారని.. అందుకే ఐసీసీ నుంచి తాము అద్భుతాన్ని ఆశిస్తున్నామని అమీనుల్ చెప్పాడు. ‘ఆఖరిసారిగా మా ప్రభుత్వంతో మాట్లాడేందుకు ఐసీసీ బోర్డు నుంచి కాస్త సమయం కోరాం. అందుకే వారు మాకు 24 గంటల గడువునిచ్చారు. అయితే ఈ విషయంలో మేము ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేబోం’ అని అమీనుల్ పేర్కొన్నాడు.