సౌదీ అరేబియాలో ఈస్టర్ వేడుకలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 02:11 PM
సౌదీ అరేబియాలో స్థానిక తెలుగు ఎన్నారైలు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. జెధ్ధా నగరంలో తెలుగు గ్లోరియస్ చర్చ్ (జి.టి.సి) ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు క్రైస్తవులు ప్రభువు పునరుత్థాన (ఈస్టర్) పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
జెధ్ధా నగరంలో తెలుగు గ్లోరియస్ చర్చ్ (జి.టి.సి) ఆధ్వర్యంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు మృత్యువును గెలిచి తిరిగి లేచిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని ప్రవాసాంధ్ర క్రైస్తవులు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. రియాధ్ నగరం నుంచి ప్రత్యేకంగా వచ్చిన బ్రదర్ సతీష్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ హానుక్ అభినవ్ తన సందేశంలో యేసు క్రీస్తు ప్రభువు వారి పునరుత్థానం లోకానికి వెలుగును, సంతోషమును, ధైర్యమును ప్రసాదించిందని అన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో నడుస్తూ అందరూ శాంతియుత జీవనాన్ని గడపాలని హానుక్ కోరారు.

గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి తెల్లవారుజామున సన్రైజ్ ఈస్టర్ సర్వీసును నిర్వహించగా అందులో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈస్టర్ సందర్భంగా జరిగిన వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. జెద్ధా నగరంలోని జి.టి.సి చర్చి ఈ ప్రాంతపు తెలుగు క్రైస్తవుల అధ్యాత్మిక అవసరాలను తీరుస్తోంది. దీన్ని పాస్టర్ హానుక్ నిర్వహిస్తున్నారు.
