ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:37 PM
ఎల్లలు దాటి ఉంటున్న ప్రవాసాంధ్రులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో పునర్ వ్యవస్థీకరించిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో వ్యూహాత్మకంగా వివిధ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎల్లలు దాటి ఉంటున్న ప్రవాసాంధ్రులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో పునర్ వ్యవస్థీకరించిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో వివిధ సామాజిక వర్గాలకు వ్యూహాత్మక ప్రాధాన్యం లభించింది.
పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలకు ఈసారి సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటూ వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు, మహిళలకు పెద్ద పీట వేశారు. విభిన్న కోణాలతో కూడిన వడబోత అనంతరం కార్యవర్గాన్ని ప్రకటించారు.

పార్టీ ఎన్నారై విభాగం ఉపాధ్యక్షురాలిగా రషీదా బేగంను నియమించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమె కువైత్లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు. మంచి వక్తగా గుర్తింపుపొందారు.

దుబాయిలో నివసించే విజయవాడకు చెందిన లావణ్య కౌతరపును ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళ అయిన ఆమె అంగబలం, ఆర్థబలం కలిగున్నారు.

కార్యదర్శిగా నియమితులైన బాపట్ల జిల్లాకు చెందిన గాలి దుర్గా భవానీకి (సౌదీ అరేబియా) ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే మహిళా నాయకురాలిగా గుర్తింపు ఉంది.

గత 25 ఏళ్ళుగా ఒమాన్లో నివసించే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వంక వెంటరమణమ్మకు పార్టీ పదవి పొందడం నూతన అనుభవం. మహిళా మెయిడ్ల సమస్యలపై పని చేసిన అనుభవం కూడా ఉంది.
దుబాయిలో పని చేసే తిరుపతి నగరానికి చెందిన ముక్కు తులసి కుమార్ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇతర గల్ఫ్ దేశాల నుంచి కోడి రాజరవి కిరణ్, రాచూరి మోహన్ రెడ్డి, ఖలీద్ సైఫుల్లా, అనిల్ కుమార్ నన్న, రామకృష్ణ పేరూరు కూడా నియమితులయ్యారు.
ఇప్పటి వరకూ నాయకత్వ పదవుల్లో ఉన్న కొన్ని బలమైన సామాజిక వర్గాలను ఈసారి పూర్తిగా తప్పించడంతో వారిలో అసంతృప్తి పెల్లుబికింది. ఈసారి పదవులు దక్కిన వారిలో అత్యధికులు నూతన ముఖాలంటూ కూడా కొందరు వాపోతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం
బ్యాంక్వెట్ విందుతో ప్రారంభమైన ఆటా వేడుకలు