నోరూరించే చేపల కూరలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:10 AM
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం... చేపల వంటకాలు. అయితే చేప రకాన్ని బట్టి వండే విధానం కూడా విభిన్నంగా ఉండాలి. అప్పుడే చేపల వంటకం రుచి అమోఘంగా ఉంటుంది. వేర్వేరు చేపలతో వండే వీలున్న వేర్వేరు వంటకాలు ఈ వారం మీకోసం...
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం... చేపల వంటకాలు. అయితే చేప రకాన్ని బట్టి వండే విధానం కూడా విభిన్నంగా ఉండాలి. అప్పుడే చేపల వంటకం రుచి అమోఘంగా ఉంటుంది. వేర్వేరు చేపలతో వండే వీలున్న వేర్వేరు వంటకాలు ఈ వారం మీకోసం...

వంజరం వేపుడు
కావలసిన పదార్థాలు:
కరివేపాకు - 2 రెమ్మలు
నెయ్యి లేదా నూనె - 2 టేబుల్ స్పూన్లు
చేప ముక్కలు - పావు కిలో
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూను
పసుపు, ఉప్పు - తగినంత
నిమ్మరసం - అర చెక్క
కారం - అర టీస్పూను
గరం మసాలా - అర టీస్పూను
తయారీ విధానం:
పైన చెప్పిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి, వాటిలో చేప ముక్కలు నానబెట్టాలి
బాండీలో నూనె వేడిచేసి, ముందుగా కరివేపాకు వేయించి, తర్వాత చేప ముక్కలు వేయాలి
చిన్న మంట మీద మూత ఉంచి చేప ముక్కలు మగ్గించుకోవాలి
రెండు వైపులా సమంగా వేగేలా గరిటతో తిప్పుతూ ఉండాలి
ఇలా పది నిమిషాల్లో చేప ముక్కలు పూర్తిగా ఉడికిపోతాయి
తర్వాత వేడిగా వడ్డించాలి.

బొమ్మిడాయల ఇగురు
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - 12
ఉప్పు - తగినంత
నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉల్లి ముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 5
పసుపు - అర టీస్పూను
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టే.స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూను
కొబ్బరి పేస్ట్ - అర కప్పు
గరం మాసాలా - 1 టీస్పూను
కొత్తిమీర - కొద్దిగా
నీళ్లు - 3 కప్పులు
తయారీ విధానం:
ఒక వెడల్పాటి గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలిపి పక్కనుంచాలి
మందపాటి గిన్నెలో నూనె పోసి, మరిగిన తర్వాత చేప ముక్కల మిశ్రమం వేసి కలుపుకోవాలి
పావు గంట పాటు చిన్న మంట మీద మూత పెట్టి చేప ముక్కలను మగ్గించుకోవాలి
తర్వాత కొబ్బరి పేస్ట్, కొత్తిమీర, నీళ్లు వేసి నెమ్మదిగా కలపాలి
మూత ఉంచి చిన్న మంట మీద 15 - 20 నిమిషాలపాటు కూర చిక్కబడేవరకూ ఉడికించి వేడిగా వడ్డించాలి.

సొర చేప పిట్టు
కావలసిన పదార్థాలు:
సొర చేపలు - 2
ఉల్లి ముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 4
ఆవాలు, మినప్పప్పు - చెరొక స్పూను
జీలకర్ర - 1 టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూను
పసుపు - 1 టీస్పూను
ఉప్పు - తగినంత
కొత్తిమీర - 1 కట్ట
నూనె - 2 టే.స్పూన్లు
తయారీ విధానం:
గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, చేపలు మునిగేటన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి
ఉడికిన తర్వాత ముక్కలు చిదిమి పక్కనుంచాలి
బాండీలో నూనె పోసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి
తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి
పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.
తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి చేప పొడి వేయాలి.
బాగా కలిపి చిన్న మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి.