ప్రశాంతంగా ఎప్సెట్
ABN , Publish Date - May 12 , 2026 | 03:46 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026(ఎప్ సెట్) ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మూడు...
అగ్రికల్చర్కు 93.34శాతం, ఇంజనీరింగ్కు 93.58శాతం హాజరు
హైదరాబాద్ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026(ఎప్ సెట్) ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మూడు సెషన్లలో జరగ్గా, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలను ఆరు సెషన్లలో నిర్వహించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలకు 90,977మంది దరఖాస్తు చేసుకోగా, 84,954మంది హాజరయ్యారు. అలాగే, ఇంజనీరింగ్ పరీక్షల కోసం 2,10,766మంది దరఖాస్తు చేసుకోగా, 1,97,241మంది పరీక్షలు రాశారు. ఆధార్ కార్డు తేలేదని అరగంట పాటు అభ్యర్థులను గేటువద్ద నిలిపేయడం, పరీక్ష ప్రారంభమయ్యాక లేటుగా వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించపోవడం వంటి ఘటనలు మినహా పరీక్షలు సజావుగా జరిగాయి. కాగా, ఇంజనీరింగ్ విభాగంలో మ్యాథమెటిక్స్ ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండడంతో సమయం సరిపోలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఎప్సెట్ పరీక్షా పత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీ ని మంగళవారం ఉదయం 11.30గంటలకు వెబ్సైట్లో ఉంచనున్నట్లు సెట్ కన్వీనర్ కె.విజయకుమార్ రెడ్డి ప్రకటించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మీసీ పరీక్షల కీని ఇప్పటికే వెబ్సైట్లో పొందుపరిచామని, ఆయా కీ లపై అభ్యంతరాలను 14వరకు స్వీకరిస్తామన్నారు. తుది కీతో పాటు ఫలితాలను ఈ నెల 20లోగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. గతంలో కంటే భిన్నంగా పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్ స్ర్కీన్పై మార్కులు ప్రత్యక్షం కావడం గమనార్హం.