మాస్టర్స్ డిగ్రీ లేకున్నా పీహెచ్డీలో సీటు.. విద్యార్థి అరుదైన ఘనత
ABN , Publish Date - Jun 07 , 2026 | 10:22 AM
లఖ్నవూ యూనివర్సిటీకి చెందిన అరిందమ్ చతుర్వేది (23) అరుదైన ఘనత సాధించారు. మాస్టర్స్ డిగ్రీ లేకున్నా పీహెచ్డీలో సీటు దక్కించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ యూనివర్సిటీకి చెందిన అరిందమ్ చతుర్వేది (23) అరుదైన ఘనత సాధించారు. మాస్టర్స్ డిగ్రీ లేకున్నా పీహెచ్డీలో సీటు దక్కించుకుని అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం, పరిశోధనతో కూడి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు చేసిన వారికి మాస్టర్స్ లేకున్నా పీహెచ్డీ సీటు పొందే వీలుంది. ఈ విధానంలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన తొలి లఖ్నవూ యూనివర్సిటీ విద్యార్థిగా అరిందమ్ అరుదైన ఘనత సాధించారు.
యూనివర్సిటీలో ప్రాచీన భారత దేశ చరిత్ర, పురావస్తు విభాగం విద్యార్థి అరిందమ్ ఈ ఏడాది పీహెచ్డీ ఎంట్రన్స్లో టాప్లో నిలిచారు. డిపార్ట్మెంట్లో అతి పిన్న వయస్కుడైన జూనియర్ రీసెర్చ్ ఫెలోగా గుర్తింపు పొందారు. ఆయన 41 పరిశోధన పత్రాలు యూజీసీ-కేర్ లిస్టెడ్ జర్నల్స్తో పాటు అంతర్జాతీయ, స్కోపస్ ఇండెక్స్డ్ జర్నల్స్లో ప్రచురణకు అర్హత పొందాయి.
యూజీసీ-నెట్ ఆర్కియాలజీ విభాగంలో 100 పర్సెంటైల్తో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించి ఆయన, యూజీసీ-నెట్ హిస్టరీ విభాగంలో 99.08 పర్సెంటైల్ సాధించారు. భారత దేశానికి ప్రస్తుతం అధ్యాపకుల అవసరం ఉందని అరిందమ్ అన్నారు. ప్రొఫెసర్ కావడమే తన లక్ష్యమని చెప్పారు.
జాతీయ విద్యావిధానం 2020, ప్రకారం, మాస్టర్స్ డిగ్రీ లేకుండా ఒక విద్యార్థి నేరుగా పీహెచ్డీలో అడ్మిషన్ పొందవచ్చు. ఇందుకోసం పరిశోధనతో కూడిన నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇతర అర్హతలు కూడా ఉంటేనే పీహెచ్డీలో అడ్మిషన్కు అర్హత ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత
యూజీసీ నెట్ 2026.. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల