సెకండ్ ఇంటర్కూ బెటర్మెంట్ అవకాశం!
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:59 AM
ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
విద్యాశాఖ నిర్ణయం.. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే బెటర్మెంట్ అవకాశం ఉంది. సెకండ్ ఇయర్ విద్యార్థులు కావాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులను ఇంప్రూవ్మెంట్ కింద రాసుకోవచ్చు. అయితే ఇంప్రూవ్మెంట్లో వచ్చిన మార్కులనే తుది మార్కులుగా పరిగణిస్తారు. అంతకంటే ముందు వచ్చిన మార్కులను రద్దు చేస్తారు. ఇకపై అలా కాకుండా సెకండ్ ఇయర్ విద్యార్థులు కావాలనుకున్న సబ్జెక్టులను ఇంప్రూవ్మెంట్ కింద ఎంపిక చేసుకుని పరీక్ష రాసుకునే వెసులుబాటును ఇంటర్బోర్డు కల్పించనుంది. ఇప్పటికే కర్ణాటక, హరియాణా, తదితర రాష్ట్రాల్లో ఈ తరహా విధానం అమల్లో ఉంది. రాష్ట్ర విద్యార్థులు జేఈఈ, ఇతర ప్రముఖ యూనివర్సిటీల సీట్లు కోల్పోకూడదని, అలాగే మార్కులు తక్కువ వచ్చాయనే కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడకూడదని ప్రభుత్వం ఈ మేరకు వెసులుబాటు కల్పించనుంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.