రైల్వే రాయితీని పునరుద్ధరించాలి
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:38 AM
మన దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య సుమారు 17 కోట్లు. వీరిలో చాలామంది పుణ్య క్షేత్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు.
మన దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య సుమారు 17 కోట్లు. వీరిలో చాలామంది పుణ్య క్షేత్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు. సీనియర్ సిటిజన్స్ సహా ఇతర కేటగిరీల వారికి ఇచ్చే టికెట్ల చార్జీలపై రాయితీని కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వే శాఖకు భారీగానే ఆదాయం వస్తున్నది. కరోనాకు ముందు వివిధ వర్గాల ప్రయాణికులకు రైల్వే ఇచ్చిన టికెట్ రాయితీల వల్ల సంస్థకు ఏటా సుమారు రూ.1,600 కోట్ల ఆదాయభారం ఉండేది. 2026–27లో రైల్వే మూలధన వ్యయానికి రూ.2,93,030 కోట్లు కేటాయించారు. కాబట్టి సీనియర్ సిటిజన్స్, పాత్రికేయులు వంటి వారికి టికెట్ల రాయితీ ఇచ్చినా కూడా రైల్వే శాఖకు అదనంగా వచ్చే ఆర్థిక సమస్యలుండవు. కావున ఈ రాయితీలను పునరుద్ధరించడంపై కేంద్రం దృష్టి పెట్టాలి. అలాగే ఎక్స్ప్రెస్, మెయిల్, సూపర్ఫాస్ట్ రైళ్లలో నిత్యం అనేకమంది సాధారణ బోగీల్లో ప్రయాణిస్తుంటారు. జనరల్ బోగీలు తక్కువగా ఉండడంతో వాటిలో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే శాఖ సాధారణ బోగీల సంఖ్యను పెంచడం ద్వారా వారు ప్రశాంతంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.
– జి. శ్రీరామమూర్తి, విజయనగరం