Share News

భారత్‌ నైతిక ఔన్నత్యం ఏమైనట్టు?

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:18 AM

మరో యుద్ధం ప్రారంభమయింది. ప్రచండంగా ఉధృతమవుతోంది. ఈ సమర సంక్షోభ సూత్రకర్త ఇజ్రాయెల్‌ కాగా యుద్ధ ప్రణాళికను అమలుపరుస్తోన్న దేశం అమెరికా. ఇరాన్‌ ఇప్పటికే అణ్వాయుధాలను అభివృద్ధిపరచుకున్నదని...

భారత్‌ నైతిక ఔన్నత్యం ఏమైనట్టు?

పశ్చిమాసియాలో కోటి మంది భారతీయులు జీవనోపాధి పొందుతున్నారు. పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా అఫ్ఘాన్‌, మధ్యాసియాకు సరుకుల రవాణా సదుపాయాలు కల్పించే ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవు అభివృద్ధికి భారత్‌ పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం సమకూరుస్తోంది. అయినా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ లక్ష్యాలను భారత్‌ అవకాశవాదంతో ఆమోదించిన దృష్ట్యా ఆ కీలక ప్రాంత వ్యవహారాలను ప్రభావితం చేయగల నైతిక పలుకుబడిని భారత్‌ కోల్పోయింది.

మరో యుద్ధం ప్రారంభమయింది. ప్రచండంగా ఉధృతమవుతోంది. ఈ సమర సంక్షోభ సూత్రకర్త ఇజ్రాయెల్‌ కాగా యుద్ధ ప్రణాళికను అమలుపరుస్తోన్న దేశం అమెరికా. ఇరాన్‌ ఇప్పటికే అణ్వాయుధాలను అభివృద్ధిపరచుకున్నదని, అమెరికాపై దాడులకు సైతం సంసిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇజ్రాయెల్‌ నూరిపోసింది. తక్షణమే యుద్ధ చర్య చేపట్టకపోతే ఇరాన్‌ నుంచి అణ్వాయుధ దాడికి గురికావలసి ఉంటుందని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. నిజమేమిటి? వర్గీకృత సమాచారం (జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య విషయాలు) అందుబాటులో ఉన్న ఉన్నతస్థాయి అధికారులు అమెరికాకు ఇరాన్‌ నుంచి అణ్వాయుధ దాడుల సంభావ్యతను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ వెల్లడించింది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ తోడ్పాటుతో ఇరాన్‌కు వ్యతిరేకంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించారు.

ఇరాన్‌ నుంచి అమెరికాకు అణ్వాయుధ దాడి ముప్పు అనేది ఒక పచ్చి అబద్ధం. గతంలో ఇరాక్‌కు వ్యతిరేకంగా ఇటువంటి నిరాధార వదంతుల ప్రచారం జరిగింది. నాటి ఇరాక్‌ నియంత సద్దాం హుస్సేన్‌ సామూహిక జనహనన మారణాయుధాలను సమకూర్చుకున్నాడన్న ఆరోపణతో 2003లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. లిబియా నియంత గడాఫీ పెద్ద ఎత్తున పౌరులను హతమార్చేందుకు పథకాలు సిద్ధం చేసుకున్నాడనే ప్రచారం అమెరికన్ మీడియాలో జరిగింది. లిబియాలో సంక్షోభాన్ని నివారించేందుకు ఆ దేశంలో సైనిక జోక్యానికి 2011లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆదేశించారు. వెనెజువెలాలో ‘పాలన మార్పు’కై మన్రో సిద్ధాంతాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ తలకెత్తుకున్నాడు. ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఆ సిద్ధాంతాన్ని పశ్చిమాసియాకు కూడా వర్తింపజేశాడు.


గతంలో ఇరాక్‌, లిబియాలో, ఇప్పుడు ఇరాన్‌లో అమెరికా సైనిక జోక్యాలు ఎంతమాత్రం చట్టబద్ధమైనవి కావు. అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేకుండా మరో దేశంపై యుద్ధాన్ని ప్రకటించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదు. ఈ నిబంధన ప్రకారం ఇరాక్‌, లిబియా, ఇరాన్‌లో సైనిక జోక్యాలు పూర్తిగా అక్రమమైనవి. ఇటువంటి సైనిక జోక్యాలు ఐక్యరాజ్యసమితి అధికార పత్రం (చార్టర్‌)కు కూడా వ్యతిరేకమైనవి. ఈ సైనిక జోక్యాలు పూర్తిగా న్యాయవిరుద్ధమైనవి. ఒక సార్వభౌమిక దేశంలో పాలన మార్పునకు పూనుకునేందుకు మరే దేశానికీ అధికారం లేదు. మరో దేశంలో పాలన మార్పునకు పూనుకోవడం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమైనది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేస్తున్న యుద్ధం ఎంతగా న్యాయవిరుద్ధమైనదో, వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్‌ చేయడం కూడా అంతే న్యాయ విరుద్ధమైనది. ఇరాన్‌ అధినేత అయతొల్లా ఖమేనీని, ఆయన సహచర నాయకులను ఇజ్రాయెల్‌ హతమార్చడం కూడా అంతే న్యాయ విరుద్ధమైనదని మరి చెప్పనవసరం లేదు. ఖమేనీ మరణం పట్ల భారత్‌ ఆరు రోజుల తరువాత మాత్రమే సంతాపం వ్యక్తం చేసింది!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రసంగిస్తూ ‘హమాస్‌ అనాగరిక దాడిలో ఆప్తులను కోల్పోయిన’ ఇజ్రాయెలీ కుటుంబాలకు భారతదేశం తరఫున సానుభూతి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలోను, ఆ తరువాత కూడా ఇజ్రాయెల్‌కు భారత్‌ బాసటగా ఉంటుందని’ ఆయన ప్రకటించారు. అయితే గాజాలోని పాలస్తీనియన్ల ఆవాసాలను ఇజ్రాయెల్‌ సైన్యం పూర్తిగా మట్టుబెట్టి వేలాది కుటుంబాలను పూర్తిగా నిరాశ్రయులను చేసిన ఘోర చర్యలను ఆయన మాటమాత్రంగానైనా ఖండించలేదు. ఎటువంటి కవ్వింపు లేకుండానే హమాస్‌ పాల్పడిన దాడిలో 1219 మంది ఇజ్రాయెలీలు చనిపోయిన మాట వాస్తవమే. అయితే గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక దాడుల్లో 70 వేల మంది పాలస్తీనియన్లు హతమారిపోయిన విషయాన్ని మోదీ ఎలా విస్మరించారు?


ప్రధాని మోదీ ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రసంగించారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమయింది. పలు అరబ్‌ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ ప్రతి దాడులు చేసింది. ఇరాన్‌పై తమ సైనిక దాడులు మూడు లేదా నాలుగు వారాలు, ఇంకా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని ట్రంప్‌ ప్రకటించాడు. ఇజ్రాయెల్‌కు ఆయన పూర్తి మద్దతు నిస్తున్నారు. దీంతో ఆ యుద్ధం అరబ్‌ దేశాలకు వ్యాపించకుండా నిరోధించేందుకు పూనుకునే అవకాశం భారత్‌కు లేకుండా పోయింది. శాంతిసాధనకు అవసరమైన నైతిక అధికారాన్ని భారత్‌ కోల్పోయింది.

ఇరాన్‌లో పాలన మార్పును సాధించడమే అమెరికా, ఇజ్రాయెల్‌ల ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఆ ఉభయ దేశాలు ఇరాన్‌పై యుద్ధానికి ఉపక్రమించాయి. అయితే ఒక దేశంలో పాలన ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ బల ప్రయోగంతో ఆ పాలనను మార్పు చేసేందుకు మరో దేశానికి ఎటువంటి హక్కూ ఉండదు. ఒక దేశంలో పాలన మార్పునకు మరో దేశం పూనుకోవడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా–ఇజ్రాయెల్‌లు చేస్తున్న వాదనల ప్రకారం చూస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మార్చవలసి ఉంది. ఇదెలా సాధ్యం? అసలు ఆ దేశాలలో అధికారంలో ఉన్న నియంతలు అమెరికాకు విశ్వసనీయ స్నేహితులే. వారిలో ఒక్కరూ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించేవారు కానేకాదు.


జూన్‌ 2025లో ఇజ్రాయెల్‌ ప్రోద్బలంతో అమెరికా ఇరాన్‌కు వ్యతిరేకంగా ‘మిడ్‌ నైట్‌ హ్యామర్‌’ పేరిట సైనిక దాడులకు పూనుకున్నది. పన్నెండు రోజుల పాటు ఆ దాడులను కొనసాగించి, విరమించిన అనంతరం ‘ఇరాన్‌లో అణ్వాయుధాల అభివృద్ధి సదుపాయాలను పూర్తిగా నిర్మూలించినట్టు’ అమెరికా ప్రకటించింది. అది నిజమైతే ఇరాన్‌ అణ్వాయుధాలను ఎలా సమకూర్చుకున్నది? శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎలా పెంపొందించుకున్నది? అమెరికాకు ముప్పుగా ఎలా పరిణమించింది? అంతేకాదు, శుద్ధి చేసిన యురేనియం నిల్వ చేసుకోబోమని, ఎట్టి పరిస్థితులలోను అణ్వాయుధాల అభివృద్ధికి పూనుకోబోమని ఇరాన్‌ విస్పష్టంగా చెప్పిందని ఇరాన్‌–అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం నెరపుతున్న ఒమన్‌ ప్రకటించింది. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్‌ ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు: ‘ఇరాన్‌లో అణ్వాయుధాలు ఉన్నాయనేందుకు రుజువులు ఏవి, ఎక్కడ ఉన్నాయి?’ అమెరికా గతంలో ప్రారంభించిన కొన్ని యుద్ధాల వలే ఇప్పుడు ఇరాన్‌పై యుద్ధం కూడా అబద్ధాల ఆధారంగానే ప్రారంభమయింది, సందేహం లేదు.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు పరస్పరం బద్ధ శత్రువులు. ఇజ్రాయెల్‌కు ఇరాక్‌, లిబియాల నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లని భద్రమైన పరిస్థితులను అమెరికా కల్పించింది. సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నది. కనీసం కొంత కాలమైనా సౌదీతో శాంతి సుస్థిరంగా ఉండవచ్చు. ఇప్పుడు ఇరాన్ నుంచి మాత్రమే ఇజ్రాయెల్‌కు ప్రమాదం ఎదురయ్యే అవకాశమున్నది. ఈ కారణంగానే ఇరాన్‌లో పాలన మార్పునకు పూనుకునేలా అమెరికాను ఇజ్రాయెల్‌ ప్రోత్సహించింది. అయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసి కొత్త పాలకులను తీసుకురావడం ద్వారా ఇరాన్‌ను పూర్తిగా దాసోహం చేసుకోవాలని అమెరికాను ఇజ్రాయెల్‌ ఒత్తిడి చేసింది. ఇదొక అసంగత సిద్ధాంతం, ఒక ప్రభుత్వ పాలన ఎంత నరకప్రాయంగా ఉన్నప్పటికీ, ఆ పాలనను మార్చివేసే హక్కు పూర్తిగా ఆ దేశ ప్రజలదేగానీ మరో దేశానికి ఎంత మాత్రం ఉండదు.


ఇరాన్‌పై తమ దాడులు అసాధారణంగా విజయవంతమవుతున్నాయని అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఇజ్రాయెలీ పాత్రికేయుడు అలొన్‌ మిజ్రాహి ఆ ప్రకటనలతో విభేదించారు. ‘ఇది నిస్సైనిక యుద్ధం. యంత్రాలు యంత్రాలతో పోరాడుతున్నాయి. ఈ అత్యంత భయంకరమైన మారణాయుధాలు ఎవరికైతే విడుపులేకుండా అందుబాటులో ఉంటాయో వారికే విజయం సమకూరుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

పశ్చిమాసియా అంతటా యుద్ధాగ్నులు తీవ్రమవుతున్నాయి, విధ్వంసం ఉధృతమవుతోంది. ఆ ప్రాంతంలో భారత్‌కు విశేషంగా ఆర్థిక, రాజకీయ, మానవ వనరుల ప్రయోజనాలు ఉన్న ప్రాంతమది. జోర్డాన్‌, కువైట్‌, బహ్రెయిన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. ఆ దేశాలన్నిటా కోటి మంది భారతీయులు ఉన్నారు. మన చమురు దిగుమతులకు ప్రధాన ఆలంబనగా ఉన్న దేశాలవి. ఆ దేశాలకు మన ఎగుమతులూ తక్కువేమీ కాదు. ఇంకా ఇతరత్రా కీలక ఆర్థిక ప్రయోజనాలూ ఉన్నాయి. ఇరాన్‌లోని సిస్థాన్‌ బలూచిస్థాన్‌ రాష్ట్రంలో ఒమన్‌ గల్ఫ్‌ తీరంలో చాబహార్‌ నౌకాశ్రయ నిర్మాణానికి మన దేశం ఇప్పటికే 370 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం సమకూర్చింది. పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా అఫ్ఘానిస్థాన్‌, మధ్య ఆసియా దేశాలకు సరకుల రవాణాకు వెసులుబాటు కల్పిస్తోన్న నౌకాశ్రయమది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నందునే పశ్చిమాసియా దేశాలకు న్యూఢిల్లీ ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తోంది. అయినా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ లక్ష్యాలను భారత్‌ అవకాశవాదంతో ఆమోదించిన దృష్ట్యా ఆ కీలక ప్రాంత వ్యవహారాలను శాంతి స్థాపన దిశగా ప్రభావితం చేయగల నైతిక పలుకుబడిని భారత్‌ కోల్పోయింది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Mar 07 , 2026 | 01:22 AM