నేత్రపర్వంగా మల్లన్న రథోత్సవం
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:56 AM
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో నాలుగో రోజైన గురువారం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు విశేష పూజలు హోమాలు నిర్వహించారు.
శ్రీశైలంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు
శ్రీశైలం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో నాలుగో రోజైన గురువారం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు విశేష పూజలు హోమాలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై ఆశీనులనుచేసి ఆలయ సంప్రదాయం ప్రకారం రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మంగళ హారతులు ఇచ్చి, సాత్విక బలి సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. సుమారు లక్ష మంది భక్తులు తరలిరావడంతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. మరోవైపు.. భ్రమరాంబికాదేవి రమావాణి సేవిత రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు: బుట్టే వీరభద్ర దైవజ్ఞ
పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు పంటలు బాగా పండుతాయని శ్రీశైల దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త బుట్టే వీరభద్ర దైవజ్ఞ తెలిపారు. శ్రీశైలంలో నిర్వహించిన పంచాంగ పఠనంలో ఆయన.. నిత్యావసరాల ధరలు పెరుగుతాయని, పాల ధరలు పెరిగి పాడి రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. కాగా.. 29 సంవత్సరాలుగా శ్రీశైల దేవస్థానానికి ఆధ్యాత్మిక సేవలందించిన ఆయనకు కలెక్టర్ రాజకుమారి ప్రశంసా పత్రం అందజేశారు.