యూకేజీ విద్యార్థి కిడ్నాప్
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:05 AM
స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థిని బైక్పై వచ్చిన ఆగంతకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో ...
స్కూల్ బస్సు దిగి ఇంటికెళ్తుండగా ఎత్తుకెళ్లిన ఆగంతకుడు
యాడికి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థిని బైక్పై వచ్చిన ఆగంతకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో బుధవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయ గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు హేమచంద్ర (7) ఉన్నారు. హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూలు బస్సులో పాఠశాలకు వెళ్లిన హేమచంద్ర.. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అదే బస్సులో గ్రామానికి తిరిగొచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళుతున్న బాలుడిని ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. గ్రామంలోని ఓ దుకాణంలో కుర్కురే ప్యాకెట్లు కొనుగోలు చేసిన ఆ వ్యక్తి.. వాటిని చిన్నారికి ఇచ్చాడని, ఆ తర్వాత బైక్పై కూర్చొబెట్టుకుని వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. ఇది కిడ్నాప్ అని అనుమానించేలోగా కిడ్నాపర్ వెళ్లిపోయాడన్నారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణం వద్ద రికార్డయిన సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.