తల్లి కళ్ల ముందే కుమారుడి మృతి
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:51 AM
తల్లితో కలిసి స్కూల్కు వెళ్తున్న కుమారుడిని ఆర్మీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. తన కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.
స్కూల్కు వెళ్తుండగా ప్రమాదం
నేరేడ్మెట్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తల్లితో కలిసి స్కూల్కు వెళ్తున్న కుమారుడిని ఆర్మీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. తన కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. ఆర్కే పురం ఆఫీసర్స్ కాలనీలో నివాసముండే సంగమ్ తమాంగ్ , నీలమ్ తమాంగ్ కుమారుడు నిజేన్ తమాంగ్(8) ఆర్మీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం తల్లి నీలమ్ తన కుమారుడిని స్కూటీపై ఎక్కించుకుని పాఠశాలకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆర్మీ వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా, అదుపు తప్పి నిజేన్ కిందపడి పోయాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న ఆర్మీ బస్సు బాలుడి పైనుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నీలమ్ను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నేరేడ్మెట్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.