Share News

కానిస్టేబుల్‌ హత్యకు న్యాయవాది కుట్ర

ABN , Publish Date - May 24 , 2026 | 05:19 AM

ఓ కానిస్టేబుల్‌ను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో తిరుపతి పోలీసులు ఓ న్యాయవాదిపై కేసు నమోదు చేశారు.

కానిస్టేబుల్‌ హత్యకు న్యాయవాది కుట్ర

  • గుట్టు రట్టు.. అలిపిరిలో కేసు నమోదు

తిరుపతి(నేరవిభాగం), మే 23(ఆంధ్రజ్యోతి): ఓ కానిస్టేబుల్‌ను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో తిరుపతి పోలీసులు ఓ న్యాయవాదిపై కేసు నమోదు చేశారు. అలిపిరి సీఐ రామకిశోర్‌ కథనం ప్రకారం.. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దోపిడీ కేసులో నాగరాజు అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. అదే కేసులో నిందితులుగా ఉన్న బద్దిక చందు, ఎస్‌కే జాఫర్‌, ఆవుల అఖిల్‌ అరెస్టై బెయిలుపై బయటికి వచ్చి ఉన్నారు. వీరిలో జాఫర్‌కు తిరుపతికి చెందిన గుణశేఖర్‌ లాయర్‌గా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో నాగరాజు ఇప్పటికీ పరారీలోనే ఉండడంతో అతడి ఆనుపానులు తెలుసుకునేందుకు అలిపిరి ఎస్‌ఐ కె. దుర్గాప్రసాద్‌ 22వ తేదీన బద్దిక చందు, ఎస్‌కే జాఫర్‌, ఆవుల అఖిల్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈక్రమంలో... అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్వయంప్రకాశ్‌ హత్యకు న్యాయవాది గుణశేఖర్‌ పురమాయించినట్టు నిందితులు తెలిపారు. దోపిడీ కేసులో నిందితులు కోర్టుకు హాజరైన క్రమంలో ఓ రోజు బద్దిక చందును ఎవరు ఎక్కడ అరెస్ట్‌ చేశారని న్యాయవాది గుణశేఖర్‌ వాకబు చేశారు. ఈ క్రమంలో చందును అరెస్ట్‌ చేసింది కానిస్టేబుల్‌ స్వయంప్రకాశ్‌ అని తెలుసుకున్న గుణశేఖర్‌ అతడిని హత్య చేయమని నిందితుడిని పురమాయించారు. హత్య కేసుకు తాను న్యాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని సీఐ వెల్లడించారు. లాయర్‌ గుణశేఖర్‌, కానిస్టేబుల్‌ స్వయంప్రకాశ్‌ తిరుపతి రూరల్‌ మండలం యోగిమల్లవరానికి చెందినవారు. తనకు కేసులు రెఫర్‌ చేయాలని గుణశేఖర్‌ కానిస్టేబుల్‌ను కోరేవాడు. అలా ఓ పాత కేసులో బాధితుడు లోకేశ్‌కు సంబంధించిన రూ.50 వేల ప్రాపర్టీ అప్పగించే కేసును గుణశేఖర్‌కు అప్పగించాడు. గుణశేఖర్‌ పిటిషన్‌ వేసి కోర్టునుం చి రికవరీ సొమ్ము తీసుకుని, బాధితుడికి ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కానిస్టేబుల్‌పై కక్ష పెంచుకున్నాడు.

Updated Date - May 24 , 2026 | 05:22 AM