అవమాన భారంతోనే శ్రీవిద్య ఉసురు తీసుకుందా?
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:34 AM
కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో ఏడాది స్టూడెంట్ పెద్దమళ్ల శ్రీవిద్య ఆత్మహత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి...
కేయూ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో మరో కోణం
రాత్రి 9 వరకు పోలీస్స్టేషన్లోనే పడిగాపులు
తోటి విద్యార్థుల ఫిర్యాదుతో మనస్తాపం
కేయూ క్యాంపస్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో ఏడాది స్టూడెంట్ పెద్దమళ్ల శ్రీవిద్య ఆత్మహత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తోటి విద్యార్థుల వేధింపులతో పాటు పోలీసుల విచారణ పేరుతో జరిగిన అవమానం భరించలేకే ఆమె తనువు చాలించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ల్యాప్టాప్ దొంగతనం జరిగిందంటూ తోటి విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై మార్చి 4న కేయూ పోలీస్స్టేషన్ చేరుకున్న శ్రీవిద్యను, రాత్రి తొమ్మిదింటి వరకు స్టేషన్లోనే పడిగాపులు కాయించినట్లు, అధికారులు లేరంటూ ఆమెను అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది. పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కడం, అక్కడ గంటల తరబడి వేచి ఉండడాన్ని భరించలేకపోయింది. తీరా రాత్రి 9గంటల సమయంలో ‘రేపు మళ్లీ రావాలి’ అని పోలీసులు చెప్పడంతో శ్రీవిద్య కుంగిపోయినట్లు సమాచారం. తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధపడింది. తన ప్రమేయం లేకపోయినా దొంగతనం నింద మోపడం, అది పోలీస్స్టేషన్ వరకు వెళ్లడం శ్రీవిద్యను ఆత్మహత్య వైపు ప్రేరేపించాయని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.