ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై చిరువ్యాపారి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:42 AM
ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి ఓ చిరువ్యాపారి బలయ్యాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూర్కి చెందిన సునారికారి మహేష్...
లక్షెట్టిపేట,జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి ఓ చిరువ్యాపారి బలయ్యాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూర్కి చెందిన సునారికారి మహేష్(41) లక్షెట్టిపేట పట్టణంలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రెండేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ప్రైవేటు వ్యక్తుల వద్ద, లోన్ యాప్ల ద్వారా సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేసాడు. దీని గురించి తరచూ కుటుంబ సభ్యుల వద్ద బాధపడేవాడు. ఈనెల 2న లోన్ యాప్ ప్రతినిధి అతని వద్దకు వచ్చి అప్పు తీర్చాలని ఒత్తిడి చేశాడు. దీంతో మహేష్ మరుసటి రోజు చెల్లిస్తానని అతనికి హామీ ఇచ్చి పంపించాడు.. అప్పు తీర్చే దారి లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం బిర్యానీ సెంటర్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.