Share News

టీవీ సౌండ్‌ తగ్గించమన్నందుకు చంపేసింది!

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:59 AM

టీవీ సౌండ్‌ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాలూకా పోలీసులు...

టీవీ సౌండ్‌ తగ్గించమన్నందుకు చంపేసింది!

  • మంగళగిరిలో భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): టీవీ సౌండ్‌ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాలూకా పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన షేక్‌ అహ్మద్‌(26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఏడాదిన్నర క్రితం మంగళగిరికి చెందిన క్రాంతి అనే మహిళతో పరిచయంవివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా, క్రాంతికి గతంలోనే పెళ్లయింది. మొదటి భర్త పోలీసు కేసు కారణంగా జైలులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అహ్మద్‌ను వివాహం చేసుకుని మంగళగిరి టిడ్కో ఇళ్లలో బీ-16 బ్లాకులో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్‌ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య పెద్ద శబ్ధంతో టీవీ పెట్టుకుని చూస్తోంది. దీంతో సౌండ్‌ తగ్గించమని చెప్పడంతో క్రాంతి ఆగ్రహంతో కత్తితో భర్తను పొడిచింది. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను స్థానికులు చినకాకానిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మంగళగిరి పట్టణ సీఐ కె.వీరాస్వామి తెలిపారు.

Updated Date - Feb 20 , 2026 | 12:59 AM