భార్య వేరే వ్యక్తిని పెళ్లాడిందని భర్త ఆత్మహత్య
ABN , Publish Date - May 16 , 2026 | 05:07 AM
తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న యువతి, ఓ బిడ్డను కన్న తర్వాత ఆ చిన్నారిని ఎవరికో ఇచ్చేసి.. ఆపై తనను వదిలిపెట్టి మరొకరిని వివాహం చేసుకోవడాన్ని...
4 ఏళ్ల ప్రేమాయణం.. నిరుడు పెళ్లి.. 5 నెలల కుమారుడు
ఆ చిన్నారిని వేరేవాళ్లకు ఇచ్చేసి వెళ్లిపోయిన యువతి
హయత్నగర్, మే 15 (ఆంధ్రజ్యోతి): తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న యువతి, ఓ బిడ్డను కన్న తర్వాత ఆ చిన్నారిని ఎవరికో ఇచ్చేసి.. ఆపై తనను వదిలిపెట్టి మరొకరిని వివాహం చేసుకోవడాన్ని ఆ యువకుడు భరించలేకపోయాడు. ‘నీతో ఎంతో సంతోషంగా ఉందామనుకున్నా. ఎంత మోసం చేశావే. నన్ను ఎలా వదిలిపెట్టాలనిపించింది నీకు?’ అని ఏడుస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్నగర్లో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా కొహెడకు చెందిన పల్లపు గోవర్దన్ (28) క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. గోవర్దన్, ఆర్టీసీలో హోంగార్డుగా పనిచేస్తున్న గున్గల్కు చెందిన యువతి సరిత మధ్య నాలుగేళ్ల ప్రేమాయణం నడిచింది. నిరుడు పెళ్లి చేసుకుని మన్నెగూడలో కాపురం పెట్టారు. సరితతో పెళ్లి విషయాన్ని గోవర్దన్ ఇంట్లో చెప్పలేదు. గత నవంబరులో గోవర్దన్-సరితకు బాబు పుట్టాడు. ఆ బిడ్డను ఇటీవలే సరిత గుర్తు తెలియని వ్యక్తులకు ఇచ్చేసింది. పైగా తాను మరో పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పడంతో గోవర్దన్ కంగుతిన్నాడు. సరిత చేసుకోబోయే వ్యక్తిని కలిసి, తమ వివాహం గురించి చెప్పాడు. అయినా ఫలితం లేకపోయింది. ఆ వ్యక్తినే మే 6న సరిత పెళ్లి చేసుకుంది. దీంతో మంగళవారం ఇంట్లో గోవర్దన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కన్న బిడ్డను వేరేవాళ్లకు ఇచ్చేసింది. సరిత నన్ను మోసం చేసింది. ఆమెను వదిలిపెట్టొద్దు’ అంటూ సెల్ఫీ వీడియోలో గోవర్దన్ రోదించాడు. తన కొడుకు మృతికి సరిత అనే అమ్మాయే కారణం అంటూ తల్లి మహేశ్వరి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.