ఇద్దరు పిల్లల్ని చంపి అర్చకుడి ఆత్మహత్య
ABN , Publish Date - May 03 , 2026 | 04:04 AM
తన మేనల్లుడితో భార్య వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి తన ఇద్దరు బిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు.
మేనల్లుడితో భార్య వివాహేతర సంబంధమే కారణం
బెంగళూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): తన మేనల్లుడితో భార్య వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి తన ఇద్దరు బిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో శివణ్ణ్ణ(40) అర్చకుడిగా సేవలు అందిస్తున్నారు. సొంత అక్క మరణించగా ఆమె కుమారుడు హేమంత్ను ఇంటికి తీసుకువచ్చి కన్నబిడ్డలాగా పెంచుకున్నారు. శివణ్ణకు భార్య కావ్య, పిల్లలు జీవన్(10), ప్రాణేశ్(5) ఉన్నారు. కావ్యతో హేమంత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిశాక అతన్ని శివణ్ణ ఇంటి నుంచి పంపేశారు. వారం క్రితం హేమంత్తో కలిసి కావ్య పరారయ్యారు. మరుసటి రోజు తిరిగి వచ్చి, పోలీస్ స్టేషన్లో క్షమాపణలు చెప్పారు. ఇకపై భర్తతోనే ఉంటానని చెప్పి ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే రూ.లక్షల విలువైన బంగారం ఆభరణాలు, నగదు తీసుకుని మరోసారి పారిపోయారు. మానసిక వేదనతో శివణ్ణ పిల్లలిద్దరినీ గొంతు నులిమి చంపి, ఉరి వేసుకున్నారు.