సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:58 AM
పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వెంటపడ్డ తన భర్త.. తనను పెళ్లి చేసుకోవడం కోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రేమ పేరుతో మతాంతర వివాహం
ఆపై కనిపించకుండా పోయిన నిందితుడు
అతడు, అతని సోదరులపై పోలీసులకు మహిళ ఫిర్యాదు
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఘటన
మూసాపేట్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వెంటపడ్డ తన భర్త.. తనను పెళ్లి చేసుకోవడం కోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత తన సోదరులు, స్నేహితులతో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. పెళ్లి చేసుకున్న పది నెలల తర్వాత అతడు పరారయ్యాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో చోటుచేసుకుంది. స్థానికంగా తన తల్లితో నివాసముంటున్న బాధితురాలు (26) వారి ఇంటి కింద ఉన్న దుకాణాన్ని అద్దెకు ఇచ్చేందుకు గత మే నెలలో ఓ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. అది చూసి నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే వ్యక్తి ట్రేడింగ్ వ్యాపారం చేస్తామని షాపును అద్దెకు తీసుకున్నాడు. కొంతకాలానికి బాధితురాలితో పరిచయం పెంచుకున్న అతడు.. ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఒకరోజు బేగంపేట్లో నివాసం ఉంటున్న తన సోదరుల ఇంటికి భోజనానికి అని తీసుకెళ్లాడు.
అక్కడ జ్యూస్లో మత్తుమందు కలిపి ఇచ్చి బాధితురాలు సృహా కోల్పోయిన తర్వాత స్నేహితులు, సోదరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో.. గత సంవత్సరం జూన్ నెలలో కూకట్పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అనేక సార్లు అతనితో పాటు అతని సోదరులు, స్నేహితులు తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. రెండు నెలల నుంచి తన భర్త కనిపించకుండా పోయాడని తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. సామూహిక అత్యాచారం బేగంపేట పరిధిలో జరిగినందున కేసును మల్కాజిగిరి కమిషనేట్కు బదిలీ చేసినట్లు చెప్పారు.