ప్రేమించినోడే కత్తిదూశాడు
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:13 AM
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి.. అంతరాలను మరచి ఆటోడ్రైవర్ను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకుంది.
ఆటోడ్రైవర్ చేతిలో మహిళా టెకీ దారుణ హత్య
నిందితుడు ముగ్గురు పిల్లల తండ్రి
ఆ విషయం తెలిసి దూరం పెట్టడంతో ఘాతుకం
భీమవరం క్రైం, జూలై 5(ఆంధ్రజ్యోతి): సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి.. అంతరాలను మరచి ఆటోడ్రైవర్ను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకుంది. కానీ అతడికి ఇంతకు ముందే పెళ్లయిందన్న విషయం తెలిసి దూరం పెట్టింది. దీంతో అతడు కక్ష పెంచుకుని ఆమెను దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన కొత్తపల్లి అనంతవాణి (32) సాఫ్ట్వేర్ ఇంజనీరు. తల్లి అనారోగ్యం కారణంగా వర్క్ఫ్రం హోం చేస్తోంది. కొర్రపాడుకు చెందిన తాడేపల్లి శ్యాంబాబు అనే ఆటో డ్రైవర్తో ప్రేమలో పడింది. అయితే అతడికి వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారన్న విషయం రెండు నెలల క్రితం అనంతవాణికి తెలియడంతో శ్యాంబాబును దూరం పెట్టింది. కక్ష పెంచుకున్న శ్యాంబాబు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి ఇంటికి వెళ్లి గొడవ పడి కత్తితో పొడిచి పరారయ్యాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. శ్యాంబాబు పరారీలో ఉన్నాడు.