క్షమించండి.. బిడ్డను కాపాడలేకపోయా!
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:52 AM
కొడుకు హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన ఆ తల్లి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.
నీళ్ల బకెట్లో పడి పసివాడు మృతి
పుత్రశోకంతో మహిళా టెకీ ఆత్మహత్య
బెంగళూరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): కొడుకు హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన ఆ తల్లి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. చంద్రా లే అవుట్ పోలీసుస్టేషన్ పరిధిలోని భైరవేశ్వరనగర్లో మహంతేశ్ వాలి కుటుంబం ఉంటోంది. మహంతేశ్ ఓ డిజైనర్ కంపెనీలో ఇంజనీరు. ఆయన భార్య ప్రతిభా వాలి(29) సాఫ్ట్వేర్ ఇంజనీరు. వీరికి అగస్త్య అనే 11 నెలల కుమారుడు ఉన్నాడు. ఇంటిపై ఆరేసిన దుస్తు లు తెచ్చేందుకు ప్రతిభ బుధవారం ఉదయం 9 గంటల సమయంలో వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఆమె కుమారుడు కనిపించలేదు. కంగారుపడి గాలించగా, స్నానాల గదిలోని నీళ్ల బకెట్లో చనిపోయి కనిపించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన ప్రతిభ.. కుమారుడి మృతిని జీర్ణించుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త మహంతేశ్.. కాలింగ్ బెల్ కొట్టినా, ఫోన్ చేసినా భార్య స్పందించలేదు. దీంతో కిటికీలోంచి చెయ్యి లోపలికి పెట్టి తాళం చెవిని తీసుకున్నారు. తలుపులు తెరిచి చూడగా, బెడ్రూంలో భార్య ప్రతిభ ఉరివేసుకుని కనిపించారు. ఆమె ఎడమచేతిని కత్తితో కోసుకోవడంతో గది అంతా రక్తసిక్తంగా మారింది. బిడ్డ మంచం మీద పడుకున్నట్లుగా కనిపించాడు. పరిశీలిస్తే చనిపోయినట్లు నిర్ధారణ అయింది. పరుపు పక్కన ఇంగ్లి్షలో భర్తను ఉద్దేశించిన రాసిన డెత్నోట్ కనిపించింది. ‘నన్ను క్షమించండి. మన బిడ్డ బాత్రూంలోని నీళ్ల బకెట్లో పడి చనిపోయాడు. బాబును కాపాడుకోలేకపోయాను. తట్టుకోలేకపోతున్నాను. అందుకే చనిపోతున్నా’ అని అందులో రాసి ఉంది. మృతదేహం పక్కన డోలో మాత్రల డబ్బా కనిపించింది. అందులో 15 మాత్రలు ఉంటాయి, డబ్బా మొత్తం ఖాళీ అవ్వడంతో మొత్తం మాత్రలు మింగినట్లు గుర్తించారు. తొలుత మాత్రలు మింగి, త్వరగా ప్రాణం పోకపోవడంతో చేతిని కోసుకుని, అప్పటికీ ప్రాణం పోలేదని.. చివరికి ఉరివేసుకుని మృతి చెందినట్లు ఘటనా స్ఠలంలో లభించిన ఆధారాలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు.