ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్
ABN , Publish Date - May 15 , 2026 | 04:51 AM
ప్రేమ వ్యవహారంలో తప్పుడు కేసు పెడతానని బెదిరించి రూ.70 వేలు లంచం తీసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు, కానిస్టేబుల్ వెంపల్లి బాలరామచంద్రరావు ఏసీబీ అధికారులకు చిక్కారు.
తాడేపల్లిగూడెం రూరల్, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రేమ వ్యవహారంలో తప్పుడు కేసు పెడతానని బెదిరించి రూ.70 వేలు లంచం తీసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు, కానిస్టేబుల్ వెంపల్లి బాలరామచంద్రరావు ఏసీబీ అధికారులకు చిక్కారు. తాడేపల్లిగూడేనికి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. గతనెల వారిద్దరూ ఇంటినుంచి వెళ్లిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్లో యువతి కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తర్వాత యువతి కనిపించడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో అత్యాచారం కేసు పెడతానని యువకుడిని ఎస్ఐ బెదిరించి, రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.70 వేలు అయినా ఇవ్వాలనడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా గురువారం వలపన్ని ఎస్ఐతో పాటు, కానిస్టేబుల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.