అలిపిరి టోల్గేట్ వద్ద రూ.65 లక్షలు పట్టివేత
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:52 AM
తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ వద్ద ఓ కారులో భారీ మొత్తంలో నగదును గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు తమిళనాడు వాసులు
తిరుపతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ వద్ద ఓ కారులో భారీ మొత్తంలో నగదును గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఓ కారులో పెద్ద బ్యాగు ల్లో భారీ మొత్తాన్ని అలిపిరి టోల్గేట్ సిబ్బంది కనుగొన్నారు. దీంతో విజిలెన్స్ అధికారులు డబ్బు తీసుకువచ్చిన తమిళనాడుకు చెందిన నీలమేఘన్, వెంకటే్షను అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడుకు చెందిన దీపక్ చిల్లర నాణేల వ్యాపా రం చేస్తారని, ఆయన వద్ద పనిచేస్తున్న తాము చిల్లర నాణేలతో మార్పిడి చేసుకునేందుకు తిరుమల ఎస్బీఐ శాఖకు రూ.65 లక్షలను తీసుకెళ్తున్నట్టు విజిలెన్స్ అధికారులకు చెప్పారు. దీంతో నగదును, వారిద్దరినీ అలిపిరి పోలీసులకు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... పట్టుబడిన రూ.65 లక్షలను తిరుపతి ట్రెజరీలో జమచేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని తిరుపతి ఆదాయపన్ను శాఖకు ఉత్తరం రాసినట్టు అలిపిరి సీఐ రామకిషోర్ వెల్లడించారు.