రూ.9.41 లక్షల కోట్ల సంపద వృద్ధి
ABN , Publish Date - Apr 16 , 2026 | 02:53 AM
ఈక్విటీ సూచీలు బుధవారం ట్రేడింగ్లో భారీగా లాభపడ్డాయి. ఒకదశలో 1,423 పాయింట్ల వరకు పుంజుకున్న సెన్సెక్స్.. చివరికి 1,263.67 పాయింట్ల లాభంతో 78,111.24 వద్ద స్థిరపడింది.
24,200 ఎగువ స్థాయికి చేరిన నిఫ్టీ
ముంబై: ఈక్విటీ సూచీలు బుధవారం ట్రేడింగ్లో భారీగా లాభపడ్డాయి. ఒకదశలో 1,423 పాయింట్ల వరకు పుంజుకున్న సెన్సెక్స్.. చివరికి 1,263.67 పాయింట్ల లాభంతో 78,111.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 388.65 పాయింట్లు ఎగబాకి 24,231.30 వద్ద ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.9.41 లక్షల కోట్లు పెరిగి రూ.458.55 లక్షల కోట్లకు (4.91 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చల పునః ప్రారంభంపై ఆశావహ వైఖరి, ముడిచమురు ధరలు మళ్లీ 100 డాలర్లకు దిగువకు చేరడం భారత్ సహా ప్రపంచ మార్కెట్ల ర్యాలీకి దోహదపడింది.
ఫారెక్స్ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి రూ.93.33 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర ఒకదశలో 95.43 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి
విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం) బంగారం ధర రూ.3,000 పెరిగి రూ.1.58 లక్షలకు చేరింది. కిలో వెండి ఏకంగా రూ.11,800 ఎగబాకి రూ.2.57 లక్షలు ధర పలికింది. అంతర్జాతీయ విపణిలో వీటి ధరలు పెరగడంతోపాటు అక్షయ తృతీయ సమీపిస్తున్న నేపథ్యంలో జువెలర్లు, స్టాకిస్టులు కొనుగోళ్లు పెంచడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం మళ్లీ 4,800 డాలర్లు దాటగా.. వెండి 79 డాలర్ల పైన ట్రేడైంది.