యూకే మార్కెట్పై పట్టు బిగిస్తున్న భారత కంపెనీలు
ABN , Publish Date - Jun 01 , 2026 | 10:06 PM
యూకే మార్కెట్లో భారత కంపెనీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే కంపెనీల సంఖ్య 60 శాతం మేర పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: యూకే మార్కెట్లో భారత కంపెనీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే కంపెనీల సంఖ్య 60 శాతం మేర పెరిగింది. గ్రాంట్ థ్రాంటన్ యూకే సంస్థ ప్రచురించిన ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుతం యూకేలో భారతీయులు నిర్వహిస్తున్న కంపెనీల సంఖ్య 1,912కు పెరిగింది. ఏడాది క్రితం ఈ సంఖ్య 1,197గా ఉండేది. ఈ కంపెనీల మొత్తం టర్నోవర్ విలువ కూడా 72.14 బిలియన్ పౌండ్ల నుంచి 105.77 బిలియన్ పౌండ్లకు పెరిగింది. 2025లో భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్య 47.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11 శాతం అధికం.
గతేడాది ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. త్వరలో ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ ఒప్పందం కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయని నివేదిక తేల్చింది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లు చేర్చేలా ఈ ఒప్పందం కుదిరింది.
ఈ నివేదిక ప్రకారం, బ్రిటన్లో భారతీయులకు చెందిన 66 కంపెనీల వార్షిక ఆదాయం 10 శాతం మేర పెరిగింది. యూకేలో ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారతీయ కంపెనీలు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. వృద్ధి పథంలో దూసుకుపోతున్న కంపెనీల్లో ప్రైమ్ ఫోకస్ ఇంటర్నేషనల్ సర్వీసు, జైడస్ ఫార్మాసిటుకల్స్ యూకే సంస్థలు ముందు వరుసలో నిలిచాయి.
ఈ వార్తలనూ చదవండి:
యూపీఐ పేమెంట్స్.. మే నెలలో సరికొత్త రికార్డు..
పసిడి ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు..