వైసీపీ పాలనలో మహిళలకు చీకటి రోజులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:03 AM
ఏపీలోని మహిళలకు గత వైసీపీ పాలన చీకటి కాలమని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. మాజీ సీఎంకు సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు నడిపించే సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ఈ వేధింపులు...
అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలతో వ్యక్తిత్వ హననం: శబరి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ఏపీలోని మహిళలకు గత వైసీపీ పాలన చీకటి కాలమని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. మాజీ సీఎంకు సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు నడిపించే సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ఈ వేధింపులు జరిగాయని ఆరోపించారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా అడ్డుకోనివారు, ఖండించనివారు ఈ రోజు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం లోక్సభలో డీలిమిటేషన్, 131 రాజ్యాంగ సవరణ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం, స్త్రీశక్తి వంటి ఎన్నో పథకాలు మహిళలకు ఉపయోగపడుతున్నాయి. దీనికి విరుద్ధంగా గత వైసీపీ పాలన రాష్ట్ర మహిళలకు చీకటి రోజులు మిగిల్చింది. మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితులైన వారు సోషల్ మీడియాలో మా క్యారెక్టర్లను కించపరిచారు. బాడీ షేమింగ్ చేశారు. ప్రస్తుత సీఎం భార్య మొదలుకొని, డిప్యూటీ సీఎం మైనర్ కుమార్తెల వరకూ ఎవరినీ వదలకుండా అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ తన మొట్టమొదటి రాజకీయ ప్రసంగంలోనే ‘మహిళా ప్రధానమంత్రి పాలిస్తున్న దేశంలో, మహిళలకు రక్షణ లేకపోవడం అవమానకరం కాదా?’ అని ప్రశ్నించారు. ఇదీ టీడీపీ వారసత్వం. ‘నారిని నారాయణిగా మార్చడం’ అనే ఈ బిల్లు లక్ష్యంతో ఎన్టీఆర్, చంద్రబాబు దార్శనికత సంపూర్ణంగా ఏకీభవిస్తుంది’’ అని బైరెడ్డి శబరి పేర్కొన్నారు.