మేం వచ్చిన వెంటనే రాధాకృష్ణ ఉండడు!
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:18 AM
‘వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏబీఎన్ కనబడదు. ఆంధ్రజ్యోతి కనబడదు. రాధాకృష్ణ ఉండడు. కొత్తపలుకు ఉండదు..
వైసీపీ నేత కాకాణి బెదిరింపులు
నెల్లూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏబీఎన్ కనబడదు. ఆంధ్రజ్యోతి కనబడదు. రాధాకృష్ణ ఉండడు. కొత్తపలుకు ఉండదు. చెత్త పలుకు ఉండదు. అసలు ఏ పలుకూ ఉండదు. అసలు నీకు పలుకే మారిపోతుంది. పలుకే మరిచిపోయే పరిస్థితి వస్తుంది’’ అని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరింపులకు దిగారు. ‘ఆంధ్రజ్యోతి’పై ఎండీ వేమూరి రాధాకృష్ణపైనా, సిబ్బందిపైనా గురువారం అసభ్యకర వ్యాఖ్యలు చే స్తూ, దూషణలకు పాల్పడ్డారు. ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం పై వైసీపీ దాడిని అడ్డుకున్న పోలీసులపైనా కాకాణి విమర్శలు గుప్పించారు. ‘ఏబీఎన్’ నుంచి జీతాలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం కాకాణి నేతృత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు నగరంలోని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తమ సంస్థ ఎండీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సిబ్బంది విధులను అడ్డుకోవడమే కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేసిన కాకాణి గోవర్ధన్రెడ్డితో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోవాలని ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక... కాకాణి వ్యాఖ్యలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తప్పుబట్టారు.