భగవద్గీతనూ కల్తీ చేసిన వైసీపీ!
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:06 AM
వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన ‘మానవులందరికీ భగవద్గీత’ పుస్తకాన్ని కూడా అపహాస్యం చేశారని....
హిందువులపై కోపంతో హిందుత్వంపై జగన్ దాడి: శ్రీనివాసానంద
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన ‘మానవులందరికీ భగవద్గీత’ పుస్తకాన్ని కూడా అపహాస్యం చేశారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు ముద్రించిన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఒక్క శ్లోకమూ లేకుండా మాయచేసి, అతిపెద్ద అపచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. జగన్ రాజకీయ ప్రసంగమైన ‘మాట తప్పను, మడమ తిప్పను’ వాక్యాలను టీటీడీ ముద్రించిన భగవద్గీతలో చేర్చడం అత్యంత విచారకరమైన అంశమని తెలిపారు. హిందువులపై కోపంతో హిందుత్వంపై నిరంతరం దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో టీటీడీని భ్రష్టు పట్టించిన తీరుపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.