వైసీపీ ఇళ్ల పట్టాల పంపిణీలో ఆరేడు వేల కోట్ల అవినీతి
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:21 AM
వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆరేడు వేల కోట్ల అవినీతి జరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు
అనర్హులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తాం
426 పశువైద్య భవనాలు నిర్మిస్తున్నాం: మంత్రులు
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆరేడు వేల కోట్ల అవినీతి జరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఈ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అకవతవకలపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో 28లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అయితే ఇప్పటికీ లక్షలాది మంది ఆ పట్టాల కన్వేయన్స్ డీడ్లు తీసుకోలేదని, దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. 43వేల మంది అనర్హులకు పట్టాలు ఇచ్చినట్లు గుర్తించామని, వాటిని రద్దు చేస్తామన్నారు.