వైఎస్కు జగన్, షర్మిల వేర్వేరుగా నివాళి
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:19 AM
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.. కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళులు అర్పించారు.
అన్న వచ్చి వెళ్లాక ఇడుపులపాయకు చెల్లి
వేంపల్లె, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.. కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం మొదట వైఎస్ జగన్, వైఎస్ భారతి, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి నేరుగా ఘాట్కు చేరుకున్నారు. ఇదే సమయంలో వైఎస్ విజయలక్ష్మి, సుధీకర్రెడ్డి ఘాట్ వద్దకు వచ్చారు. అందరూ కలిసి వైఎస్సార్ సమాధిపై పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఏటా ఫాదర్ నరేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది అవేవీ లేకుండానే నివాళుల కార్యక్రమాన్ని త్వరగా ముగించేశారు. ఉదయం 7.55 గంటలకి ఘాట్ వద్దకు వచ్చిన జగన్... 8.20 గంటలకి అక్కడి నుంచి బయల్దేరి హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లిపోయారు. జగన్ వెళ్లిన తర్వాత కుమారుడు రాజారెడ్డి, కోడలు ప్రియ, కుమార్తె అంజలితో కలసి షర్మిల... వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న తల్లి విజయలక్ష్మి, బాబాయి సుధీకర్రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలసి తండ్రికి నివాళి అర్పించారు. ఫాదర్ నరేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వచనములు, ప్రార్థనలు నిర్వహించారు.
