వైసీపీలో ‘ఇఫ్తార్’ వివాదం!
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:20 AM
రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని భావించిన వైసీపీని.. సొంత పార్టీ నేతల మధ్య ఏర్పడిన కుమ్ములాటలు ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి...
నేతల మధ్య కుమ్ములాటలు
కార్యక్రమాన్ని తానే చేస్తున్నట్టు మహిళా నేత సోషల్ మీడియా ప్రచారం
బిర్యానీ కాంట్రాక్టర్తో ఫ్లెక్సీలు
జగన్ వద్దకు చేరిన పంచాయితీ
గుంటూరు నుంచి విజయవాడకు మార్పు
గుంటూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని భావించిన వైసీపీని.. సొంత పార్టీ నేతల మధ్య ఏర్పడిన కుమ్ములాటలు ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి. దీంతో ఏకంగా వేదకను మార్చేసింది. అయితే.. ఈ మార్పునకు భద్రతా కారణాలను బూచిగా చూపడం సొంత పార్టీలోనే చర్చకు దారితీసేలా చేసింది. వాస్తవానికి తొలుత ఇఫ్తార్ విందును ముస్లింలు ఎక్కువగా ఉండే గుంటూరులో నిర్వహించాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలించి ఖాయం చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం ఈ నెల 10న ఇఫ్తార్ విందుకు సన్నద్ధమయ్యారు. కానీ, అనూహ్యంగా 9వ తేదీ రాత్రి గుంటూరులో ఇఫ్తార్ కార్యక్రమం రద్దు చేసినట్టు పార్టీ ప్రకటించింది. భద్రతా కారణాలతోనే రద్దు చేసినట్టు తెలిపింది. అయితే.. పార్టీ నేతల మధ్య జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ మార్పు వెనుక గుంటూరు నేతల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలే కారణమని తెలిసింది. గుంటూరులో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తున్నట్లు ఓ మహిళా నేత సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు, ఇఫ్తార్లో వడ్డించే బిర్యానీ కాంట్రాక్ట్ను దక్కించుకున్న వ్యక్తిని.. దానికి ప్రతిగా నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరో నేతకు ఆ మహిళా నాయకురాలి వ్యవహారం ఆగ్రహం తెప్పించింది. సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు ఆమె వ్యవహారం ఉందని భావించిన ఆయన.. ఈ విషయంపై పార్టీ అధినేత జగన్ దగ్గర పంచాయితీ పెట్టారు. దీంతో గుంటూరులో కార్యక్రమాన్ని రద్దు చేసి.. విజయవాడకు మార్చాలని జగన్ ఆదేశించినట్టు తెలిసింది. ఫలితంగా గుంటూరులో విందును రద్దు చేశారు. ఆ వెంటనే ఈ నెల 18న విజయవాడలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్టు మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇదిలావుంటే, గుంటూరులో ఇఫ్తార్ విందు రద్దుకావడంతో మండపానికి, క్యాటరింగ్కు ఇచ్చిన అడ్వాన్స్లు తిరిగి ఇప్పించాలని నిర్వాహకుడు ఒత్తిడి చేసినట్లు తెలిసింది.