బీజేపీ కాంట్రాక్టర్ల జేబు నింపేందుకే కొత్తచట్టం: షర్మిల
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:04 AM
కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అద్భుతంగా అమలైందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
ధర్మవరం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అద్భుతంగా అమలైందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పథకాన్ని భ్రష్టును పట్టించారని మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె కూలీలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ పేద ప్రజలు పనులు లేక పట్టణాలకు వలస వెళుతుండటంతో ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వలసలను నివారించేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. బీజేపీ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు. వీబీజీ రామ్జీ పేరిట ఒక పనికిమాలిన చట్టం తెచ్చారని షర్మిల విమర్శించారు.