జెండా అంటే పడదా జగన్!?
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:15 AM
పంద్రాగస్టు వచ్చిందంటే... ఢిల్లీలో ఎర్రకోట నుంచి గల్లీలో స్కూలు దాకా ప్రతి చోటా మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. అధికార పదవుల్లో ఉన్న వారు, పార్టీల అధ్యక్షులు తప్పనిసరిగా పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
పతాకావిష్కరణకు దూరంగా వైసీపీ చీఫ్
అధికారంలో ఉండగా మొక్కుబడి తంతు
పదవి పోయాక వరుసగా మూడో ‘సారీ’
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పంద్రాగస్టు వచ్చిందంటే... ఢిల్లీలో ఎర్రకోట నుంచి గల్లీలో స్కూలు దాకా ప్రతి చోటా మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. అధికార పదవుల్లో ఉన్న వారు, పార్టీల అధ్యక్షులు తప్పనిసరిగా పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కానీ... వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనికి మినహాయింపు. ఆయన ‘జెండాకూ మనకూ పడదు బాస్’ అన్నట్లుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు మాత్రం... ‘తప్పనిసరి తంతు’లాగా మాత్రమే జగన్ పంద్రాగస్టు రోజున జెండాను ఎగురవేశారు. 2024లో అధికారం పోయాక ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నదే లేదు. అంతకుముందు కూడా అధికారంలో లేనప్పుడు ఒకటి రెండుసార్లకు మించి ఆయన పతాకావిష్కరణ చేసిన సందర్భాలు లేవు. అప్పుడు కూడా జనగణమన గీతాన్ని ఆలపించకుండా మౌనంగా నిల్చున్నారు. వీకెండ్కు బెంగళూరుకు వెళ్లిపోయే జగన్... శనివారం కూడా అక్కడి ప్యాలె్సలోనే ఉన్నారు. అక్కడైనా పతాకావిష్కరణ చేశారా అంటే అదీ లేదు. ‘ఎక్స్’లో శుభాకాంక్షల సందేశంతో సరిపెట్టారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అప్పగించారు. వీటన్నింటి నేపథ్యంలో... జెండాకు జగన్ ఎందుకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే... ఒకసారి తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో అందరూ జనగణమన పాడుతుండగా, జగన్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఈ దృశ్యాలు శనివారం మరోసారి సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని పట్టుబడుతున్న జగన్... ఆగస్టు 15, జనవరి 26న జెండా వందనం మాత్రం ఎందుకు చేయరు?