రప్పా రప్పా!
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:29 AM
జగన్ ఇబ్రహీంపట్నం యాత్రలో ‘రప్పా రప్పా’ నినాదాలతో వైసీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. ‘2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం 2.0’ అని రాసిన...
‘మాకు విధ్వంసం కావాలి’ అని రాసిన హ్యాండ్ ఫ్లెక్సీలతో పర్యటనలో వీరంగం
విజయవాడ (ఇబ్రహీంపట్నం), ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జగన్ ఇబ్రహీంపట్నం యాత్రలో ‘రప్పా రప్పా’ నినాదాలతో వైసీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. ‘2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం 2.0’ అని రాసిన హ్యాండ్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. కొంతమంది బ్లేడుతో చేతులు కోసుకుని జగన్ హ్యాండ్ ఫ్లెక్సీకి వీర తిలకం దిద్దారు. జోగి రమేశ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పడేశారు. వారిస్తున్న పోలీసులపై గొడవకు దిగారు. జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సెల్ఫోన్లు, గోల్డ్ చెయిన్లు, పర్సులు కొట్టేశారు. జోగి ఇంటికి వెళుతున్న జగన్ కాన్వాయ్లో ఓ ప్రైవేటు అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అయినా వైసీపీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోలేదు. జగన్ పర్యటన ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు తిండి తిప్పలు లేకుండా చేసింది. మధ్యాహ్నం భోజనం లేకుండా చేయడంతో కంచికచర్లకు చెందిన ఓ మహిళ సొమ్మసిల్లిపడిపోయింది.