Share News

7 నుంచి యోగా కార్యక్రమాలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:04 AM

యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

7 నుంచి యోగా కార్యక్రమాలు

  • 21న అమరావతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమానికి సీఎం

  • యోగా ప్రచార పరిషత్‌ ఏర్పాటుకు సీఎం ఆమోదం: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందిని ఇందులో భాగస్వాములను చేస్తామన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఏపీ యోగా ప్రచార పరిషత్‌ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారని తెలిపారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్నారు. 7న ప్రారంభ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహిస్తామన్నారు. 20వ తేదీ వరకు విజయవాడలో యోగా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈనెల 21న ముగింపు కార్యక్రమాలను అమరావతిలో వెస్ట్‌బైపాస్ (కృష్ణా నదిపై నిర్మించిన వంతెన)పై 25 వేల మందితో నిర్వహించే యోగాసనాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు 4 కేటగిరీల్లో రూపొందించిన వీడియోలను 8142404888 నంబర్‌ ద్వారా ఉచితంగా వాట్సాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు మంత్రి తెలిపారు.

Updated Date - Jun 02 , 2026 | 06:04 AM