వైసీపీ కార్యకర్తల దాష్టీకం
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:23 AM
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది తూర్పుఎస్సీకాలనీలో వైసీపీ కార్యకర్తలు దాష్టీకం ప్రదర్శించారు.
ప్రకాశం జిల్లా కరవదిలో టీడీపీ జెండా తొలగింపు
ప్రశ్నించిన మహిళలపై అసభ్య ప్రవర్తన, రాళ్లదాడి
ఒంగోలు(రూరల్), మార్చి 29(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది తూర్పుఎస్సీకాలనీలో వైసీపీ కార్యకర్తలు దాష్టీకం ప్రదర్శించారు. ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఆవిష్కరించిన జెండాను పోల్తో సహా తొలగించారు. అనంతరం రోడ్డుపై వేసి కాళ్లతో తొక్కారు. అదేమని ప్రశ్నించిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిపై రాళ్లు విసిరారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలతో వాదులాటకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఘటనను వీడియో తీస్తున్న ఓ మహిళ నుంచి దౌర్జన్యంగా సెల్ఫోన్ లాక్కొని డిలీట్ చేశారు. ఘటనపై టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని కొందరు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలనీలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.